సీఎం జగన్ అభ్యర్ధన..సీబీఐ అభ్యంతరం: వ్యక్తిగత మినహాయింపు పైనా: ఆ రోజే నిర్ణయం..!
ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి సారి తన కేసుల్లో కోర్టుకు హాజరైన జగన్ కోర్టుకు అభ్యర్ధన చేయగా..సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు బదులుగా సహ నిందితులు కోర్టుకు హాజరయ్యేందుకు అనుమతించాలంటూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్తోపాటు... సీబీఐ కేసుల సంగతి తేలాకే ఈడీ కేసుల్లో విచారణ జరపాలంటూ వేసిన మరో పిటిషన్పైనా విచారణ జరిగింది. ఇప్పటికే కేసుల విచారణలో జరిగిన జాప్యంపై సీబీఐ అభ్యతరం చెప్పినట్లు సమాచారం. వ్యక్తిగత మినహాయింపు పైన సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. వ్యక్తిగత మినహాయింపు కుదరదని..జగన్ పిటీషన్ తీసిపుచ్చాలని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ రెండు పిటీషన్ల పైన ఈ నెల24న తీర్పు వచ్చే అవకాశం ఉంది.
సీఎం జగన్ కు జాతీయ మహిళా కమిషన్ సూచన: నేడు అమరావతిలో పర్యటన: సుమోటోగా విచారణ..!
వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ..
ముఖ్యమంత్రి జగన్ తన వ్యక్తిగత కేసుల్లో సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులు, వారి తరఫు న్యాయవాదులు మినహా మిగిలిన వారందరినీ కోర్టు హాలు నుంచి బయటికి పంపిన తర్వాత జడ్జి విచారణ (ఇన్ కెమెరా) జరిపారు. అందుతున్న సమాచారం మేరకు నకు బదులుగా సహ నిందితులు కోర్టుకు హాజరయ్యేందుకు అనుమతించాలంటూ జగన్ తరపు న్యాయవాది పిటీషన్ దాఖలు చేసారు. ఇదే రకమైన పిటీషన్ ను జగన్ గతంలోనే దాఖలు చేసారు. తనకు బదులుగా న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలంటూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ను ఇదే న్యాయస్థానం గత నవంబరులో కొట్టేసింది. తాజాగా... తనకు బదులుగా తన సంస్థల తరఫున నిందితులుగా ఉన్న ఇద్దరు పేర్లను ప్రస్తావిస్తూ వారు... హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
అధికారిక విధుల్లో బీజీగా ఉండటంతో..
ముఖ్యమంత్రిగా అధికారిక విధుల్లో జగన్ బిజీగా ఉన్నారని, ఒకసారి కోర్టు విచారణకు హాజరవ్వాలంటే భారీగా ఖర్చవుతుందని ఆయన తరఫు న్యాయవాది నివేదించారు. దీనిని ఈడీ తరఫు స్పెషల్ పీపీ సుబ్బారావు వ్యతిరేకించారు. జగన్ తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కొంటున్నారని... ఇటువంటి కేసుల్లో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వరాదని వాదించారు. దీనిపై దాదాపు 10 పేజీల కౌంటర్ దాఖలు చేశారు. జగన్ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. జగన్ అక్రమాస్తుల కేసులో 2012 మార్చిలో సీబీఐ మొదటి చార్జిషీట్ దాఖలు చేసిందని, ఎనిమిదేళ్లు గడిచినా ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉందని సీబీఐ స్పెషల్ పీపీ కె.సురేందర్ పేర్కొన్నారు. ఐదు చార్జిషీట్లలో డిశ్చార్జ్ పిటిషన్లను కలిపి విచారించాలంటే ఇంకా ఎన్నేళ్లు పడుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.
సీబీఐ కేసుల సంగతి తేలాకే ..
సీబీఐ కేసుల సంగతి తేలాకే ఈడీ కేసుల్లో విచారణ జరపాలంటూ వేసిన మరో పిటిషన్పైనా విచారణ జరిగింది. దీనిని ఈడీ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో విచారణ సమాంతరంగా సాగాలన్నారు. దీనిపైనా తుది తీర్పును జడ్జి 24వ తేదీకి వాయిదా వేశారు. అదే సమయంలో జగన్ కేసుల విచారణ ను మాత్రం ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. కోర్టుకు హాజరైన సీఎం జగన్..కేసు వాయిదా పడగానే తిరిగి బేగంపేట నుండి నేరుగా అమరావతికి వెళ్లిపోయారు. అయితే, ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలి సారి కోర్టుకు హాజరవ్వటంతో రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి కనిపించింది.