పోలవరంపై సీఎం జగన్ సమీక్షా సమావేశం .. అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో స్పిల్ వే, అఫ్రోచ్ చానల్, అప్ స్ట్రీమ్ కాపర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం , గేట్ల అమరిక తదితర కీలక పనులపై జలవనరుల శాఖకు సంబంధించి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు చూస్తున్న ఉన్నతాధికారులతో వివరాలడిగి తెలుసుకున్నారు .
పోలవరం నిర్మాణంలో గత ప్రభుత్వం తప్పిదాలపై అధికారులతో సీఎం జగన్
పోలవరం నిర్మాణంలో గత ప్రభుత్వం తప్పిదాల వల్ల పలు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని సమావేశంలో ప్రస్తావించిన సీఎం జగన్ స్పిల్ వే పనులు పూర్తి కాకుండా కాపర్ డ్యాం నిర్మించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనులు చేయలేదని, అరకొరగా అక్కడక్కడా పనులు చేసి వదిలిపెట్టిందని సీఎం జగన్ అధికారులతో చర్చించారు. ఇక అసంపూర్ణంగా మిగిలి ఉన్న పనులు పూర్తి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పోలవరంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నామన్న అధికారులు
గతంలో కాపర్ డ్యాంలో ఉంచిన ఖాళీల కారణంగా వరదల సమయంలో 13 మీటర్ల వేగంతో వరద ప్రవాహం వచ్చిందని తెలిపిన అధికారులు, దీనివల్ల ఈసిఆర్ఎఫ్ డ్యామ్ వద్ద గ్యాప్ 1 , గ్యాప్ 2 లలో భారీ ఎత్తున కోతకు గురి అయిందని పేర్కొన్నారు. ఫలితంగా వరదల సమయంలో స్పిల్ ఛానల్ పనులకు కూడా తీవ్ర ఇబ్బంది ఎదురైందని తెలిపారు. ఇక ఈ పనులు అన్నింటిపైనా ప్రత్యేకమైన దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నామని అధికారులు జగన్మోహన్ రెడ్డికి వివరించారు.
పోలవరం పనులపై అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
ఇప్పటికే స్పిల్ వే పనులు పూర్తయ్యాయని చెప్పిన అధికారులు, మే నెలాఖరు నాటికి కాపర్ డ్యాం పనులను కూడా పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ఇక గేట్ల , సిలిండర్ల బిగింపు శరవేగంగా సాగుతోంది అని పేర్కొన్నారు. పోలవరం సహాయ పునరావాస కార్యక్రమాల పైన కూడా సమీక్షించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం ఎత్తు తగ్గింపుపై కథనాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అధికారులతో చర్చించారు.
పనుల పురోగతిపై అధికారుల వివరణ
పోలవరం ఎత్తు తగ్గించే అవకాశమే లేదని స్పష్టం చేసిన అధికారులు, సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా ఇదే విషయాన్ని పేర్కొందని సీఎం జగన్ మోహన్ రెడ్డితో చెప్పారు. ఇప్పటికే నిర్దేశిత ఎత్తుకు తగినట్లుగా షట్టర్ ల బిగింపు పూర్తవుతుందని వెల్లడించిన వారు ఈ సమయంలో ఎత్తు తగ్గింపు సాధ్యం కాదన్నారు . యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు.