నేడు సీఆర్డీఏ అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం ... రాజధాని ఇష్యూపై ప్రకటన చేస్తారా ?
ఏపీలో రాజధాని మారుస్తున్నారు అంటూ జరుగుతున్న ప్రచారంపై పెద్ద ఎత్తున రచ్చ కొనసాగుతున్న సమయంలో, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు నిర్వహించనున్న సీఆర్డీఏ సమీక్ష సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని అంశంపై ఏ నిర్ణయం తీసుకుంటారు? ఎలాంటి ప్రకటన చేస్తారు? అసలు ప్రకటన చేస్తారా లేదా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి.
ఏపీలో రాజధాని పై కొనసాగుతున్న రణం ...
ప్రస్తుత రాజధాని ముంపు ప్రాంతం అని, అమరావతి రాజధానికి అనుకూలం కాదని దీనిపైన మరోసారి చర్చ జరగాల్సిన అవసరం ఉందని బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. అప్పటినుండి ఇప్పటివరకు రాజధాని అంశంపై రోజుకొక స్టేట్మెంట్ రాజకీయ ప్రముఖులు ప్రకటిస్తూనే ఉన్నారు. దీంతో రాజధాని ప్రాంత వాసులు ఆందోళన బాట పట్టారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు రాస్తారోకోలు నిర్వహించి నిరసన తెలియజేశారు. ఇక ప్రతిపక్ష పార్టీలు రాజధానిని మార్చే కుట్ర జరుగుతుందని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తుంటే, అధికార పార్టీ నేతలు ఎవరికి తోచినట్లుగా వారు సమాధానం చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నారు.
Recommended Video
నేడు క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సమీక్ష సమావేశం నిర్వహించనున్న జగన్
అమెరికా నుండి జగన్ వచ్చిన తర్వాత రాజధాని అంశం పై మాట్లాడుతారని భావిస్తే ఇప్పటి వరకు జగన్ జరుగుతున్నదంతా మౌనంగా చూస్తూ కూర్చున్నారు. ఇక దీంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరుగుతున్న క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అంశం పై ఏమైనా మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక నేడు నిర్వహించనున్న ఈ సమీక్ష సమావేశానికి సీఎస్, ఉన్నతాధికారులు, సీఆర్డీఏ చైర్మన్, కమీషనర్ తదితరులు హాజరవుతారు.ముఖ్యంగా ఈ సమీక్ష సమావేశంలో రైతులకు చెల్లించాల్సిన కౌలు, రాజధాని భవనాల నిర్మాణంపై ప్రధానంగా సమీక్ష నిర్వహించనున్నారు సీఎం జగన్.
రాజధాని విషయంలో సీఎం జగన్ ప్రజలకు స్పష్టత ఇస్తారా అన్న ఉత్కంఠ
ఇక ఇదే సమయంలో అమరావతి ప్రాంత రైతులు రాజధానిపై స్పష్టత ఇవ్వాలని ధర్నాలు చేస్తున్నారు. ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అమరావతి రాజధానిలో గత టీడీపీ ప్రభుత్వం భారీగా ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని, భూముల సేకరణ లో అవినీతికి పాల్పడిందని, బలవంతంగా రైతుల వద్ద నుండి భూములు లాక్కున్నారని, బినామీల పేరుతో టిడిపి నేతలు రాజధానిలో భూములు కొనుగోలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా బయటపెడుతోంది. ఈ క్రమంలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై కీలక సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలని భావిస్తోంది వైసిపి సర్కార్. ఇక నేడు ఆ వివరాలు బయటపెడతారా అన్న చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది. సీఆర్డీఏ సమీక్ష సమావేశం నేపథ్యంలో ఈ రోజైనా రాజధాని విషయంలో సీఎం జగన్ ప్రజలకు స్పష్టత ఇచ్చేలా ఏదైనా ప్రకటన చేస్తారా? లేక ఈ సందిగ్ధతను ఇలాగే కొనసాగిస్తారా అన్నది ఏపీలో ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. మరి నేడు జరగనున్న సమావేశంలో సీఎం జగన్ తీసుకోబోతున్న కీలక నిర్ణయాలు ఏంటి? సమీక్షలో ప్రధానంగా ఏం అంశాల పై దృష్టి సారిస్తారు అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది.