కడప ప్రజలకు గుడ్ న్యూస్: త్వరలో పట్టాలెక్కనున్న స్టీల్ ప్లాంట్..ఇక ఉద్యోగాల పండగే..!
విజయవాడ: ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపకు మహర్దశ పట్టనుందా..? కడపలో తలపెట్టదలచిన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చనున్నాయా..? రాయలసీమకే కడప జిల్లా తలమానికంగా అవతరించబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయంలో కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు సూచనలు చేయడమే కాకుండా ఇతర నిపుణుల నుంచి కూడా సలహాలు స్వీకరించారు.
కేసీఆర్..కేంద్రం మధ్యలో జగన్ : కళ్లు మండేదెవరికి...: ఏపీ సీఎం అసలు టార్గెట్ అదే..!
కడప స్టీల్ ప్లాంట్ పై సీఎం సమీక్ష
ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు కర్మాగారం తర్వాత ఆస్థాయిలో ఏపీ ప్రభుత్వం మరో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని భావించిన సంగతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్ల పల్లె వద్ద నిర్మించాలని భావిస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ గతేడాది డిసెంబర్లో శంకుస్థాపన కూడా చేశారు. ఇక అప్పటి నుంచి స్టీల్ ప్లాంట్ పై పలు సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. వీలైనంత త్వరగా ఆ స్టీల్ ప్లాంట్ను పూర్తి చేయాలనే ఉద్దేశంతో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం. తాజాగా దీనికి సంబంధించిన రివ్యూ మీటింగ్ను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కరికల్ వలవన్లతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
భూసేకరణకు ఆదేశం
ఉక్కు కర్మాగారం నిర్మాణంకు ఎలాంటి స్ట్రాటజీ అవలంబించాలో సీఎం జగన్ మంత్రి అధికారులతో చర్చించారు. అంతేకాదు అక్కడ ఎలాంటి ఉత్పత్తులు తయారు చేయాలనేదానిపై కూడా జగన్ చర్చించినట్లు సమాచారం. అంతేకాదు సాంకేతిక సమస్యలు ఇతరత్రా సమస్యలపై కూడా చర్చించారు. ఇక ఈ భారీ ప్రాజెక్టు కోసం కావాలసిన భూమిని వేగంగా సేకరించాలని జగన్ ఆదేశించారు. ఇక ఈ సమావేశంలో ఇతర స్టీల్ కంపెనీల యాజమాన్యాలతో కూడా చర్చించాలని జగన్ సూచించారు. వారి సలహాలు సూచనలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు కడప స్టీల్ ప్లాంట్లో వారి భాగస్వామ్యం కూడా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ సీఎండీ సీఎస్ వర్మ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని తన సలహాలను సీఎంకు ఇచ్చారు.
నిపుణుల సలహా తీసుకున్న సీఎం జగన్
స్టీల్ ఇండస్ట్రీలకు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి డిమాండ్ ఉందో ఆయన వర్మ సీఎం జగన్కు వివరించారు. ముడిసరుకు, రవాణా, ఉత్పత్తుల తయారీపై కూడా సూచనలు సలహాలు ఇచ్చారు. కడప స్టీల్ ఇండస్ట్రీలో భాగస్వామ్యం అయ్యేందుకు చాలా కంపెనీలు ముందుకొస్తాయని చెప్పారు. ఇక సూచనలు స్వీకరించిన సీఎం కడప స్టీల్ ప్లాంట్కు ఏ సంస్థలు ముందుకొస్తాయో వారితో చర్చలు జరిపి వెంటనే ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అంతేకాదు త్వరతగతిన అన్ని అనుమతులు పొందేందుకు మ్యాప్ సిద్దం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ముడిసరుకు సరఫరా చేసేందుకు ఎన్ఎండీసీతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
Recommended Video
నిరుద్యోగులకు వరం
2019 ఎన్నికలకు ముందు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం దగ్గర స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూడా శంకుస్థాపన చేసింది. స్టీల్ ప్లాంట్ కోసం అప్పటి టీడీపీ నాయకుడు రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ దీక్ష కూడా చేశారు. స్వయంగా చంద్రబాబు వచ్చి అక్కడ శంకుస్థాపన చేశారు. అయితే ఎన్నికలు జరగడం టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వంలోకి రావడంతో మళ్లీ ప్లాన్ మారి అదే నియోజకవర్గంలో మరో చోటుకు స్టీల్ ప్లాంట్ మారింది. ఇక ఈ స్టీల్ ప్లాంట్ పూర్తయితే ఎలాగూ 75శాతం ఉద్యోగాలు స్థానికులకే అన్న చట్టంను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి కడప జిల్లా నిరుద్యోగులకు ఇదొక వరంగా నిలవనుంది.