ఒక్క ఏడాదిలో కరువు తీరుస్తా అన్న సీఎం జగన్ .. పోలవరం పై అసెంబ్లీలో హామీ
ఏపీలో రాజధాని విషయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా పోలవరంపై క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . రాష్ట్రానికి రెండు కళ్ళుగా ఉన్న రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ లపై సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కళ్ళు పొడిచేలా ఉన్నాయని రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నాయని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఇక ఈ నేపధ్యంలో మూడు రాజధానుల బిల్లుపై సభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు పై ప్రజలకు క్లారిటీ ఇచ్చారు .
రివర్స్ టెండరింగ్ వల్ల 830 కోట్ల రూపాయలు ఆదా చేశామన్న జగన్
ఒక్క సంవత్సరంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరుతామని చెప్పారు. పోలవరంపై అవాకులు చెవాకులు పేలుతూ నిర్మాణంపై ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేతలకు దిమ్మదిరిగే సమాధానం చెప్పాలని భావించిన జగన్ అసెంబ్లీ సాక్షిగా పోలవరం ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్ ఏపీ కలల ప్రాజెక్టు పోలవరం తాజా పరిస్థితిపై మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ చేశామని దానివల్ల ఏకంగా 830 కోట్ల రూపాయలు ఆదా చేశామని ప్రకటించారు.
2021 జూన్ నాటికి పోలవరం పూర్తి.. ఏడాదిలో కరువు తీరుస్తానన్న జగన్
పోలవరం ప్రాజెక్ట్ లో ఆదా చేయటం మాత్రమే కాదని, ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇప్పటికే ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. వర్షాలు తగ్గగానే శరవేగంగా పనులు మొదలు పెట్టామని చెప్పిన జగన్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయని పేర్కొన్నారు. 2021 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ఆయన అసెంబ్లీలో తెలిపారు. 2021లో రైతుల కరువు తీరుస్తామని, రైతులకు నీళ్లు ఇస్తామని సగర్వంగా ప్రకటిస్తున్నానని జగన్ భావోద్వేగంతో పేర్కొన్నారు.
చంద్రబాబులా పోలవరాన్ని ఏటీఎంలా వాడడం లేదన్న జగన్
పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబులా పోలవరాన్ని ఏటీఎంలా వాడడం లేదని స్పష్టం చేశారు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పోలవరంపై టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఐదేళ్ల లో పూర్తి చేయని ప్రాజెక్టు ను ఏడాది లోనే పూర్తి చేస్తామని ఆయన చెప్పి పోలవరంపై అపోహలకు తావు లేకుండా చేశారు. మరి చెప్పిన సమయంలో పోలవరం నిర్మాణం పూర్తవుతుందో లేదో వేచి చూడాలి.