సీఎంకు ఇంత అవమానమా..అధికారులది లెక్కలేని తనమా..వైసీపీ క్యాడర్ ఫైర్
అది జిల్లా కీలక సమావేశం. ఇంఛార్జి మంత్రి వచ్చారు. జిల్లా మంత్రులు హాజరయ్యారు. ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అధికారులంతా తరలివచ్చారు కానీ అక్కడున్న వారికెవరికీ ప్రభుత్వాధినేత మాత్రం గుర్తుకు రాలేదు. విజయనగరం జిల్లా ఇంఛార్జి మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా మంత్రులు హాజరయ్యారు. ఇంఛార్జి మంత్రి రాగానే ఆయనతో పాటు జిల్లా మంత్రుల మీద స్వామి భక్తి చాటుతూ అధికారులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడా ఆ ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి జగన్ ఫోటో మాత్రం కనిపించలేదు.
తాజా ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అభివృద్ధి సమీక్షల్లో ముఖ్యమంత్రి ఫోటోకు కచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ అధికారులకు ఆ విషయం మాత్రం పట్టలేదు. దీనిపైన వైసీపీ క్యాడర్ భగ్గుమంటోంది. జగన్ లేకుండా మీరెక్కడున్నారని ప్రశ్నిస్తోంది. దీనికి అధికారులు ఇంఛార్జ్ మంత్రితో పాటు జిల్లా మంత్రులు కూడా సమాధానం చెప్పాలని క్యాడర్ డిమాండ్ చేస్తోంది. శిలాఫలకాలపైన పేరు లేకపోయిన ప్రోటోకాల్లో సరైన గౌరవం లేకపోయినా గగ్గోలు పెట్టే మంత్రులకు ముఖ్యమంత్రిని గౌరవించే విధానం తెలియదా..? అధికారులు తప్పు చేస్తే సరిచేయాల్సిన బాధ్యత వీరికి లేదా అన్నది వైసీపీ కార్యకర్తల ప్రశ్న.
విజయనగరం జిల్లా పైన ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ శాంక్షన్ చేశారు. అంతేకాదు సాలూరులో గిరిజనుల కోసం ట్రైబల్ యూనివర్శిటీలు మంజూరు చేశారు సీఎం జగన్. మరి జిల్లాపై అంత ప్రేమను చూపిస్తున్న ముఖ్యమంత్రిని మరువడాన్ని వైసీపీ క్యాడర్ జీర్ణించుకోలేకుంది. బ్యానర్లో సీఎం జగన్ ఫోటో లేకపోవడం ముమ్మాటికీ అధికారుల తప్పిదమే అయినప్పటికీ మంత్రులు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. అంతకుముందు జరిగిన పలు సమీక్షా సమావేశాల్లో కూడా అధికారులు జగన్ ఫోటో లేదని వైసీపీ క్యాడర్ గుర్తుచేసింది.