ప్రశాంత్ కిషోర్ టీం వస్తోంది -సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు : తేల్చి చెప్పిన సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ తన మిషన్ - 2024 ను తేల్చి చెప్పారు. ఇప్పటికే రెండున్నారేళ్ల అధికారం పూర్తి చేసుకున్న జగన్ ఇక, తిరిగి 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవటం పైన ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ పధకాల పైన చేస్తున్న విమర్శల పైన సీఎం జగన్ మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రులంతా ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలని సీఎం పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల పై జగన్ కీలక వ్యాఖ్యలు
అదే సమయంలో మంత్రులు జిల్లాలోని ఎమ్మెల్యేలను..ఎమ్మెల్సీలను కలుపుకొని ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఇక, అధికారంలో వచ్చి త్వరలో మనం మూడేళ్లు పూర్తి కానున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం స్పష్టం చేసారు. అందులో దాదాపుగా 85 నుంచి 90 శాతం మార్పులు ఉంటాయని సీఎం తేల్చి చెప్పారు. ప్రస్తుత కేబినెట్ లో ఉన్న మంత్రులను మార్చి వారికి పూర్తిగా పార్టీ బాధ్యతలు..మిషన్ 2024 లక్ష్యంలో భాగంగా కేటాయిస్తామని సీఎం ముందుస్తు గానే స్పష్టం చేసారు.
తప్పించిన మంత్రుల సేవలు పార్టీ కోసం..
సీఎం జగన్ ఏది చేసినా ముందుగా చెప్పి చేయటం అలవాటు. తొలి కేబినెట్ ఏర్పాటు సమయంలోనే తాను రెండున్నారేళ్ల తరువాత కేబినెట్ విస్తరణ ఉంటుందని.. 90 శాతం మంది మంత్రులను మార్చాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. ఇప్పుడు తిరిగి అవే సంకేతాలు ఇచ్చారు. మంత్రి పదవులు కోల్పోయిన వారికి పార్టీ కోసం పని చేయటం ద్వారా మరింత కీలకమైన బాధ్యతలు అప్పగిస్తున్నామనే విషయాన్ని గుర్తించాలని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మరో కీలక అంశాన్ని సీఎం ప్రస్తావించారు.
ప్రకాంత్ కిషోర్ టీం మరలా వస్తోంది..
2019 ఎన్నికలకు దాదాపుగా ఏడాదిన్నార ముందుగానే ఏపీకి వచ్చి వైసీపీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్ టీం మరోసారి తమకు పని చేయనున్నట్లు జగన్ వెల్లడించారు. వచ్చే ఏడాది మే నుంచి ప్రశాంత్ కిషోర్ టీం ఏపీకి వస్తుందని..వైసీపికి పని చేయనుందని జగన్ తన కేబినెట్ మంత్రులకు వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకూ ఆ టీం పార్టీ కోసం పని చేస్తుందని జగన్ క్లారిటీ ఇచ్చేసారు. అయితే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తరువాత తాను ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయనంటూ ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.
గడప గడపకూ వైసీపీ ప్రారంభించాలి
అయితే, ఇప్పటికీ కొన్ని పార్టీలకు ప్రశాంత్ కిషోర్ నాయకత్వం వహించిన పీకే టీం సభ్యులు పొలిటికల్ స్ట్రాటజిస్టులుగా పని చేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ లో జగన్ సోదరి షర్మిల పార్టీకి సైతం పీకే టీం సభ్యులే పని చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు పీకే టీం తిరిగి వైసీపీ కోసం పని చేసేందుకు రానుందని స్వయంగా సీఎం నోటి నుంచి వచ్చిన మాట కావటంతో..దీనిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశంగా పార్టీ నేతలు చెబుతున్నారు.
జగన్ టార్గెట్ -2024
బయట ప్రతిపక్షాలు ..ఇతరులు ప్రచారం చేస్తున్నట్లుగా ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదని ... ప్రజల్లో ఉన్న సానుకూలత మరింత అనుకూలంగా మలచుకొనే వ్యూహాలు అమలు చేయాలని జగన్ నిర్దేశించారు. అందు కోసం ప్రతీ మంత్రి..ఎమ్మెల్యే ప్రతీ ఇంటికి పార్టీ - ప్రభుత్వ పధకాల గురించి వివరిస్తూ గడప గడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా అక్టోబర్ రెండో తేదీ నుంచి తాను ప్రభుత్వ పధకాల సమీక్షల్లో భాగంగా రచ్చబండలో పాల్గొంటానని గతంలోనే సీఎం వెల్లడించారు.
సీఎం వ్యాఖ్యలతో రాజకీయంగా మరనున్న సమీకరణాలు
దీంతో..వైసీపీ ముందస్తుగానే 2024 ఎన్నికల కోసం రంగంలోకి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. సీఎం మాత్రం అధికారంలో ఉన్నా..వచ్చే ఎన్నికల పైన అప్పుడే మంత్రులకు దిశా నిర్దేశం చేయటం...సీనియర్లను తొలిగించక తప్పదనే సంకేతాలు ఇవ్వటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో..ప్రత్యేకించి వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం వ్యాఖ్యలు ప్రతిపక్షాల్లోనూ ఆసక్తి కరంగా మారుతున్నాయి.