వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోతుల సునీత-బీఫారం ఇచ్చిన సీఎం జగన్- కొత్త రాజకీయం
ఏపీలో గతంలో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి చేర్చుకోవాలంటే రాజీనామా చేసి రావాలని గతంలో ప్రకటించిన సీఎం జగన్ దాన్ని అక్షరాలా అమలు చేస్తున్నారు. గతంలో తమ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ను తిరిగి అభ్యర్ధిగా నిలబెట్టి గెలిపించుకున్న వైసీపీ.. ఇప్పుడు అదే కోవలో మరో ఎమ్మెల్సీగా పోతుల సునీతను ఎంపిక చేసింది.
వైసీపీలో చేరేందుకు ఎమ్మెల్సీ పదవి వదులుకున్న పోతుల సునీతను ఆ పార్టీ తమ అభ్యర్ధిగా ప్రకటించింది. ఇవాళ పోతుల సునీత సీఎం జగన్ను క్యాంపు కార్యాలయంలో కలిసి బీ ఫారం తీసుకున్నారు. తనను ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు సునీత సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. సునీతతో పాటు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పోతుల సురేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీ పదవికి టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పోతుల సునీత గతేడాది రాజీనామా చేశారు. మూడు రాజధానులపై శాసనమండలిలో చర్చ సందర్భంగా ఆమె టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి వదులుకున్నారు. సునీత రాజీనామాను ఆ తర్వాత శాసనమండలి ఛైర్మన్ ఆమోదించారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. తాజాగా ఎన్నికల కమిషన్ ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించింది. ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు 18వ తేదీ వరకూ గడువు ఉంది. జనవరి 19 వరకూ నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 21 గడువుగా ఇచ్చారు. జనవరి 28న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.