నెల్లూరు నేతలపై జగన్ సీరియస్: కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నారా: నేడు సీఎం వద్ద పంచాయితీ..!
నెల్లూరు జిల్లాలో వైసీపీ తాజా ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. పదికి పది అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. ఎంపీ సీటు దక్కించుకుంది. దీంతో..జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. కానీ, నాలుగు నెలలకే అక్కడ అధికార పార్టీలో ముసలం మొదలైంది. జిల్లా ఎమ్మెల్యేల మధ్య విభేదాలు..ఆధిప్యత పోరు తారా స్థాయికి చేరింది. బహిరంగ విమర్శల దాకా వెళ్లింది. కాంగ్రెస్ నుండి వైసీపీలో చేరిన నేతలు ఇంకా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నారా అంటూ ముఖ్యమంత్రి మండిపడే స్థాయికి చేరింది.
తాజాగా జిల్లాలో అధికార పార్టీ నేతల ప్రచ్ఛన్న రాజకీయ యుద్దం పైన ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. జిల్లాలోని నేతలు తన వద్దకు రావాల్సిందిగా ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు..త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు..ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా వ్యవహరిస్తున్న నేతల పైన జగన్ కఠిన వైఖరితో ఉండాలని నిర్ణయించారు. అదే విషయాన్ని నేతలకు స్పష్టం చేయనున్నారు. దీంతో..నేడు సీఎం వద్ద జరిగే నెల్లూరు పంచాయితీ రాజకీయంగా ఆసక్తిగా మారింది.
నెల్లూరు నేతల మీద సీఎం సీరియస్..
ఎన్నికలు ముగిసిన తరువాత క్లీన్ స్వీప్ చేసి..పార్టీకి అండగా నిలిచిన నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు ముఖ్యమంత్రికి తల నొప్పిగా మారాయి. కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాల పైన సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి స్థానికంగా ఒక ఎంపీడీవో తన ఇంటి మీద దాడి చేసారంటూ ఫిర్యాదు చేయటం పైన ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫలితంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే, ఆయన మీద నమోదు చేసిన కేసుల మీద అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అదే సమయంలో కోటంరెడ్డి పార్టీలోని ఇతర నేతల మీద చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా అధికార పార్టీలో కలకలం మొదలైంది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రికి చేరింది.
కోటంరెడ్డి వర్సెస్ ఆ ఇద్దరు నేతలు..
జిల్లాలో ఎమ్మెల్యే కోటంరెడ్డి..అదే విధంగా సర్వేపల్లి ఎమ్మెల్యే జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇద్దరూ బంధువులే. తాజా ఎన్నికల వరకూ ఇద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికీ పైకి బాగానే కనిపిస్తున్నాయి. అయితే.. ఎంపీడీవో వివాదంలో కోటంరెడ్డి చెప్పిన పని చేయవద్దంటూ ఎంపీడీఓకు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పటం..అదే విధంగా కోటంరెడ్డి పైన కాకాని అనుచరులు కేసు నమోదు చేయిం చారని కోటంరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయటం కలకలం రేపింది. సొంత పార్టీ నేతలే తన మీద కేసు పెట్టారని కోటంరెడ్డి ఆరోపించారు. అదే విధంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి..కోటంరెడ్డి మధ్య సైతం విభేదాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఉద్దేశ పూర్వకంగానే కోటంరెడ్డికి ఆదాల ఆర్దిక సాయం చేయలేదని చెబుతున్నారు. దీంతో..వేమిరెడ్డి ఆయనకు అండగా నిలిచారు. ఇక, జిల్లాలో వీరి ముగ్గురు కేంద్రం గా నడుస్తున్న రాజకీయం పార్టీలో నేతలకు ఇబ్బందిగా మారింది.
నేడు సీఎం జగన్ వద్ద పంచాయితీ..
నెల్లూరులో సొంత పార్టీలో నెలకొన్న పరిస్థితుల పైన ఆగ్రహంతో ఉన్న సీఎం జగన్ నెల్లూరు జిల్లా నేతలను తన వద్దకు రావాలని ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో నేతల మధ్య సమన్వయ లోపంపై చర్చించనున్నారు. పార్టీని నడిపించాల్సిన ఎమ్మెల్యేలు విభేదాలతో రచ్చ చేయటం పైన ఇద్దరు ఎమ్మెల్యేల పైన ఆయన ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే విధంగా గతంలో హెచ్చరించినా కోటంరెడ్డి వైఖరిలో మార్పు రావటం లేదని..అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో హుందాగా వ్యవహరించాలని గతంలోనే సూచన చేసారు. ఈ సమావేశం ద్వారా ముఖ్యమంత్రి జగన్ జిల్లా నేతలకు క్లాస్ తీసుకొనే అవకాశం ఉంది. దీంతో..ఇప్పుడు ముఖ్యమంత్రి జరగనున్న ఈ పంచాయితీ పైన రాజకీయంగా ఆసక్తి నెలకొని ఉంది.