పులివెందులపై సీఎం జగన్ వరాల జల్లు :ఇక ప్రగతిపధంలో సీఎం సొంత నియోజకవర్గం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సీఎం జగన్ ఏపీ అభివృద్ధి పై తనదైన శైలిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వాటి అమలుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే తన సొంత నియోజకవర్గమైన పులివెందుల పై కూడా ప్రత్యేక దృష్టి సారించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గంకు సీఎం వరాల జల్లు కురిపించారు.
మంత్రులపై సీఎం జగన్ ఫైర్: యాక్టివ్ కాకుంటే ఇక అంతే: అగ్రిగోల్డ్ చెల్లింపుల ముహూర్తం ఖరారు ...!
పులివెందులలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు నిర్ణయం
గత ఎన్నికల్లో వైసిపి తిరుగులేని విజయాన్ని సాధించిన నేపథ్యంలో సీఎం జగన్ రెండు రోజులపాటు పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఇక తాజాగా తాజాగా పులివెందులలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం ప్రకటించిన అభివృద్ది పనులు, మౌళిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలతో పులివెందుల ప్రగతి పథంలో దూసుకుపోనుంది.
మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేపనిలో జగన్
పులివెందులలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఆ పనిలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం జగన్. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పై సమీక్ష నిర్వహించిన జగన్ ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పులివెందుల నియోజకవర్గంలో 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పులివెందుల ఏరియా ఆసుపత్రికి, వేంపల్లి పీహెచ్ సి కి 30 కోట్లతో మౌలిక సౌకర్యాల ఏర్పాటు చేయనున్నారు. పులివెందులలో 17.6 5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
పులివెందులలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
పులివెందుల మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీ కోసం 50 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు జగన్. వేముల మండలం నల్లచెరువు పల్లి లో 132 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జె ఎన్ టి యు కొత్త లెక్చరర్ కాంప్లెక్స్, నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి పది కోట్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సింహాద్రిపురం, వేంపల్లి పాలిటెక్నిక్ కాలేజ్ లకు 15 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని సమీక్షలో నిర్ణయించారు. పులివెందుల మార్కెట్ యార్డ్ లో మౌలిక సదుపాయాల కల్పనకు 5 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు
పులివెందుల నియోజకవర్గంలో కొత్తగా 7 గోడౌన్లు , కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాలన్నారు. ఏపీ కార్ల్ కు సీఈవో ని నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసి త్వరితగతిన నియామకానికి ఆదేశాలు జారీ చేయాలన్నారు. పులివెందుల శిల్పారామం కోసం 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక వేంపల్లి లోని మినీ శిల్పారామం ఏర్పాటుకు భూమిని గుర్తించాలని, నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్, గండి క్షేత్రం, గండికోట, ఒంటిమిట్ట, జిల్లాలో ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్కూట్ ఏర్పాటుచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు
పులివెందులలో కొత్త ఫైర్ స్టేషన్ బిల్డింగ్, వేంపల్లిలో కొత్త ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలని నిర్ణయించారు. నాడు నేడు పధకం కింద పులివెందుల నియోజకవర్గంలోని స్కూళ్ళను రూ. 30 కోట్లతో అభివృద్ది చేయాలని నిర్ణయించారు. 2012 - 13 సంవత్సరంలో రబీ పంటకు సంబంధించి ఇన్సూరెన్స్ భీమా సొమ్ము సుమారు రూ.112 కోట్లు త్వరితగతిన రైతుల ఖాతాలోకి చేరేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు నెలల్లోగా రైతుల ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పులివెందులకు వరాల జల్లు .. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ఇలా అనేక కీలక నిర్ణయాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించి పులివెందుల రూపురేఖలు మార్చాలని కంకణం కట్టుకున్నారు. ప్రగతి పధంలో పులివెందుల దూసుకు పోవడానికి కావలసిన అన్ని కీలక నిర్ణయాలు తీసుకుని,అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో పులివెందుల ప్రజలు జగన్ తీసుకున్న నిర్ణయాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.