ఎమ్మెల్యేలకు సీఎం జగన్ కొత్త టాస్క్ - ఆ మాట వినిపించకూడదు..!!
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లో ఎమ్మెల్యేలంతా భాగస్వాములు కావాలని, ఆస్పత్రుల సందర్శన ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు.
ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆస్పత్రుల సందర్శన ప్రారంభించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే ఆస్పత్రుల సందర్శన ద్వారా వాటి పనితీరుపై వారి పర్యవేక్షణ కూడా ఉంటుందని చెప్పారు. ఇంకా ఏమైనా లోపాలు, సమస్యలు ఉంటే వారి నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుని వాటిని కూడా పరిష్కరించే చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. మార్చి 1 నుంచి కూడా గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాగి మాల్ట్ అందించాలని సీఎం సూచించారు.
ఎక్కడా మందులకు కొరత ఉందన్న మాటే వినిపించకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ప్రజారోగ్య వ్యవస్థలో దేశానికి మన రాష్ట్రం ఒక ఆదర్శంగా నిలవాలని నిర్దేశించారు. స్కూల్స్, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు అనుసంధానమై తల్లులు, పిల్లల్లో రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలని సూచించారు. 108, 104 వాహనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ప్రతిరోజూ దీనిపై సమీక్ష చేయాలని సీఎం ఆదేశించారు. సిబ్బంది ప్రతి కుటుంబాన్నీ కలుసుకుని విలేజ్ క్లినిక్స్ సేవలను వివరించాలన్నారు. రక్తపోటు, మధుమేహం లాంటి ఎన్సీడీ వ్యాధులతో బాధపడే వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని చెప్పారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిని నివారించడానికి దాదాపు రూ.700 కోట్లు ఖర్చుపెడుతున్నామని వివరించారు. పాలకొండకు కూడా మరో సుమారు రూ.265 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు ఆస్పత్రిని నిర్మిస్తున్నామని వివరించారు.
రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగానే గుర్తించి వారికి తగిన వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. ప్రతి బోధనాసుపత్రిలో కూడా క్యాన్సర్ నివారణా పరికరాలు, చికిత్సలు ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రతి బోధనాసుపత్రిలోనూ గుండెజబ్బుల చికిత్సా కేంద్రాలు ఉండాలన్న సీఎం... అన్ని చోట్లే క్యాథ్ ల్యాబ్స్ పెట్టాలన్నారు. ఆరోగ్య శ్రీ సేవలపై యాప్కు సంబందించి సీఎం కొన్ని సూచనలు చేసారు. త్వరలోనే ఈ యాప్ అందుబాటులోకి రానుంది. రోగులకు మరింత నాణ్యతతో, మెరుగైన సేవలే లక్ష్యంగా యాప్ ఉండాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.