జగన్ ఎక్కడా తగ్గట్లేదు :ఇక టార్గెట్ లోకేశ్: పంచాయితీ రాజ్ పనులు నిలిపివేత..!
వరుసగా పనులు నిలిపివేత..నోటీసులు..రద్దు వంటి నిర్ణయాలతో ప్రభుత్వం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివాదాస్పద నిర్ణయాలంటూ జాతీయ స్థాయిలోనూ ప్రచారం జరుగుతోంది. స్వయంగా సీఎం జగన్ సైతం తన నిర్ణయాలు వివాదాస్పదం అయినా..తాను ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందీ వివరణ ఇస్తూ..తనను తాను సమర్ధించుకుంటున్నారు. ఒక వైపు ఏపీలో పెట్టుబడుల కోసం 35 దేశాల రాయబారులతో సమావేశం అయిన సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి మాజీ మంత్రి లోకేశ్ నిర్వహించిన పంచాయితీ రాజ్ శాఖ పనుల సమీక్షకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీ రాజ్ పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఒక వైపు విమర్శలు వస్తున్నా..జగన్ మాత్రం తగ్గటం లేదు. అసలు జగన్ టార్గెట్ ఏంటి..
ప్రకాశం జిల్లాలో కరణం బలరాం కి తలనొప్పిగా మారిన ఆమంచి కృష్ణ మోహన్
టార్గెట్ లోకేశ్ .. తాజా నిర్ణయం
జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిన నిర్ణయాల పైన రివ్యూలు చేస్తూ..నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం..ఇప్పుడు లోకేశ్ నిర్వహించిన శాఖ మీద ఫోకస్ చేసింది. అందులో భాగంగా.. పంచాయతీరాజ్లోరాజ్లో ఇంజినీరింగ్ పనులు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.586.4 కోట్ల విలువైన ఇంజినీరింగ్ పనులు నిలిపివేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 144 పనులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటికి ముందు అనుమతి పొంది ప్రారంభంకాని పనులు నిలిపివేసింది. పనులు ప్రారంభమైనా 25 శాతానికి మించని వాటిపై రివ్యూ నిర్వహించారు. దీంతో విజయనగరం, నెల్లూరు, అనంతపురం, కర్నూలుపంచాయతీరాజ్లో మినహా ఇతర జిల్లాల్లో పనులు నిలిచిపోనున్నాయి. ఏప్రిల్ లో ఎన్నికలు జరగటం..ఆ తరువాత కొత్తగా ఏ పనులు ప్రారంభించకపోవటంతో అప్పటి వరకు పనుల పైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు కేవలం పార్టీ నేతలకు కమీషన్ల కోసమే నాటి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందనే అనుమానం నేటి ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. దీంతో..ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే పలు నిర్ణయాలతో విమర్శలు..
ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తయింది. ఈ కాలంలోనే అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. ఇవి ఏపీలోనే కాదు..జాతీయ స్థాయిలోనూ వివాదాస్పద నిర్ణయాలంటూ చర్చకు కారణమయ్యాయి. తొలుత పీపీఏల సమీక్ష.. పోలవరం పనుల నుండి నవయుగను తప్పిస్తూ నోటీసులు.. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు.. బందరు పోర్టు నిర్మాణ ఒప్పందం రద్దు వంటి నిర్ణయాల పైన పెద్ద ఎత్తున చర్చ సాగింది. పీపీఏల సమీక్ష..పోలవరంలో నవయుగను తప్పించటం పైన కేంద్రం సైతం జోక్యం చేసుకుంది. నేరుగా ప్రధానికి మఖ్యమంత్రి జగన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇక తాజాగా జరిగిన రాయబారుల సదస్సులో సైతం ముఖ్యమంత్రి తాను ఇటువంటి వివాదాస్పద నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది వివరించారు. ఇక, ఇటువంటి నిర్ణయాల పైన ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరిస్తుందని..ఇప్పట్లో ఇటువంటి నిర్ణయాలు ఉండవని అందరూ భావించారు. కానీ, రాయబారుల సమావేశం జరుగుతున్న సమయంలోనే మరో సారి పనుల రద్దు నిర్ణయం పైన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయితీ రాజ్ శాఖలో పనులను సమీక్ష చేయాలని అందులో పేర్కొంది.
జగన్ ఎక్కడా తగ్గట్లేదు..
పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తుతున్నా ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన నిర్ణయాల పైన పునరాలోచన చేయటం లేదు. ఇదే సమయంలో మరిన్ని నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రధాని వద్ద దాదాపు 40 నిమిషాల భేటీలో అరగంటకు పైగా రద్దు నిర్ణయాల పైనే ముఖ్యమంత్రి వివరణ ఇచ్చినట్లు సమాచారం. అవినీతి జరిగినట్లు రుజువైతే ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని ప్రధాని సైతం అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. అయితే, ఇదంతా ముఖ్యమంత్రి జగన్ తన పాలనలో అవినీతికి ఆస్కారం లేకుండా.. రివర్స్ టెండరింగ్ ద్వారా ఏపీకి ఖర్చు తగ్గించే క్రమంలో భాగంగా తీసుకుంటున్న నిర్ణయాలుగా చెబుతుంటే..గత ప్రభుత్వం పైన కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. అయినా..ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడా వాటిని ఖాతరు చేయటం లేదు. తాను ఏ విధంగా నిర్ణయించుకున్నారో అదే బాటలో ముందుకు కదులుతున్నారు. ఇవి రాజకీయంగా పార్టీ ..ప్రభుత్వం మీద ఎటువంటి ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.