CM Jagan: పార్టీ ముఖ్య నేతలకు సీఎం జగన్ పిలుపు - కీలక నిర్ణయం దిశగా..!!
CM Jagan Meeting: ముఖ్యమంత్రి రానున్న ఎన్నికల పైన ఫోకస్ పెట్టారు. ముందస్తు నిర్ణయాలతో రాజకీయ వేడి పెంచుతున్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న సీఎం జగన్..ఇప్పుడు మరో కీలక నిర్ణయం ప్రకటించేందుకు సిద్దమయ్యారు. పార్టీ పదవుల్లో మార్పులు - చేర్పులు చేసిన ముఖ్యమంత్రి..ఇక ప్రజల్లో ప్రభుత్వం - పార్టీ ఇమేజ్ ను మరింత పెంచేలా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పార్టీ కీలక నేతలతో సమావేశానికి నిర్ణయించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న సీఎం జగన్ ఈ నెల 8న పార్టీ ముఖ్య నేతలతో భేటీకి డిసైడ్ అయ్యారు. ఏపీలో ముందస్తుపై ప్రచారం వేళ ఈ భేటీ పైన ఆసక్తి కనిపిస్తోంది.
ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక కసరత్తు షురూ
ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగే అఖిల పక్ష సమావేశంలో పాల్గొంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటిస్తారు. ఇప్పటికే ఏపీలో ముందస్తుగానే ఎన్నికల కసరత్తు సీఎం ప్రారంభించారు. పార్టీ రీజలన్ ఇంఛార్జ్ లతో పాటుగా పలువురు జిల్లా అధ్యక్షులను మార్చారు. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా అభ్యర్దుల ఎంపిక పైన ఫోకస్ పెట్టారు. ఇందు కోసం మూడు అంచెల వడపోత విధానం అమలు చేస్తున్నారు. సర్వే సంస్థలను రంగంలోకి దించారు. స్థానికంగా ప్రభావం చూపే అంశాలతో పాటుగా ప్రాంతీయ - సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక చేయనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పైన ప్రజల్లో ఉన్న అభిప్రాయాలకు అనుగుణంగా అభ్యర్ధిని ఫైనల్ చేయనున్నారు. అదే సమయంలో ప్రజలతో టచ్ లో లేని వారిని పక్కన పెట్టటం ఖాయమనే సంకేతాలు ఇస్తున్నారు.
పార్టీ ముఖ్య నేతలతో సీఎం కీలక భేటీ..
ఎన్నికల వ్యూహాలపైన కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి కీలక భేటీకి నిర్ణయించారు. ఈ నెల 8న పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు - జిల్లా అధ్యక్షులతో పాటుగా నియోజకవర్గాల వారీగా నియమితులైన పార్టీ ఇంఛార్జ్ లతో సీఎం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర పార్టీ నుంచి నియోజకవర్గం వరకు సమన్వయంతో పాటుగా ఈ నేతల బాధ్యతల పైన ముఖ్యమంత్రి జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. నియోజవకర్గంలో ఎమ్మెల్యే - పార్టీ ఇంఛార్జ్ తో అనుబంధ సంఘాలను కలుపుకుంటూ ముందుకెళ్లే అంశం పైన రూట్ మ్యాప్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు గడప గడపకు ప్రభుత్వం నిర్వహణ పైన వర్క్ షాప్ నిర్వహించిన ముఖ్యమంత్రి..వారి పనితీరు పైన స్పష్టత ఇచ్చారు. టికెట్ల విషయంలోనూ తేల్చి చెప్పారు. టికెట్లు ఇవ్వలేని వారి సేవలను పార్టీకి వినియోగించుకుంటామని స్పష్టం చేసారు. ఎన్నికల కు ఆరు నెలల ముందుగానే అభ్యర్దుల ప్రకటన ఉంటుందని ప్రకటించారు.
ఏపీలో ముందస్తు పై ప్రచారం వేళ..
ఏపీలో కొద్ది రోజులు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ ముఖ్య నేతలు ఏ సమయంలో అయినా సీఎం జగన్ ముందస్తు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వంలోని ముఖ్యులు మాత్రం ముందస్తు అవకాశం లేదని చెబుతున్నారు. కానీ, సీఎం జగన్ మాత్రం ఎన్నికలకు సంబంధించి అటు ప్రభుత్వం - ఇటు పార్టీ బాధ్యతలను ప్రతీ నియోజకవర్గంలో సమన్వయం చేసుకొనేలా ఈ సమావేశంలో నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో నేతల మద్య విభేదాల విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని సీఎం డిసైడ్ అయ్యారు. పార్టీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎంత ప్రతిష్ఠాత్మకమో వివిరిస్తూనే..అవసరైతే ఎంత కఠిన నిర్ణయాలైనా తప్పవని స్పష్టం చేయనున్నారు. ఎన్నికలు ఎప్పుడు అనే అంశం పైన ఈ సమావేశంలో సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.