ఏపీ అసెంబ్లీలో 55 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు..అగ్రస్థానంలో సీఎం జగన్
అమరావతి: క్రిమినల్ కేసులు ఉన్న రాజకీయనాయకులను పోటీలోకి ఆయా పార్టీలు ఎలా నిలబెడుతాయని సుప్రీంకోర్టు గురువారం ప్రశ్నించింది. అంతేకాదు వారికి సంబంధించిన కేసులను ప్రస్తావిస్తూ నాయకుల పేర్లతో సహా తమ పార్టీ అధికారిక వెబ్సైట్లపై సోషల్ మీడియాలో పొందుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఆయా పార్టీలకు 48 గంటల పాటు గడువు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీకి సంబంధించి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసులను తమ అఫిడవిట్లలో ఫైల్ చేశారు.
మోసగాళ్ళు ఏపీ సీఎం జగన్ సతీమణి భారతి పేరును వదలట్లేదుగా... భారతి పీఏ అని చెప్పి ...
క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారు ఎమ్మెల్యేలుగా విజయం
2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2011 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో 334 మంది అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసులను ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో పొందుపర్చారు. ఇక 222 మంది అభ్యర్థులు తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే క్రిమినల్ కేసులు ఉన్న నాయకులు మొత్తం 96 మంది ఎన్నికల్లో విజయం సాధించారు. అంటే క్రిమినల్ కేసులున్న 55శాతం మంది అభ్యర్థులు గెలుపొందారు. ఇక తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిలో 55 మంది అభ్యర్థులు చట్టసభల్లోకి అడుగుపెట్టగలిగారు.
మొత్తం 55 మంది ఎమ్యెల్యేలు.. జగన్ పై అత్యధిక కేసులు
అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ (ఏడీఆర్) రిపోర్టు ప్రకారం క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న 55 మంది ఎమ్మెల్యేల్లో అధికారిక వైసీపీ నుంచి 50 మంది ఎమ్మెల్యేలు ఉండగా... మిగిలిన ఐదులో నలుగురు టీడీపీ సభ్యులు ఒకరు జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. ఇక మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు ఏదో ఒక కేసులో దోషులుగా నిర్థారించబడ్డారని ఏడీఆర్ నివేదిక చెబుతోంది. ఇక తీవ్రమైన కేసులను ఎదుర్కొంటున్న వారిలో సీఎం జగన్ ముందువరుసలో ఉన్నారు. ఆయనపై 38 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కేసులు నమోదైనంత మాత్రానా క్రిమినల్స్ కాదని కోర్టులో అవి నిరూపితం కావాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.
ఈడీ సీబీఐ కేసులున్న వ్యక్తి సీఎం పదవిలో ఉండరాదు
ఇదిలా ఉంటే పలు సీబీఐ కేసులు, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్ అని తను ముఖ్యమంత్రి పదవిలో ఉండరాదని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ఉండటం దురదృష్టం అన్నారు. క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రభుత్వాన్ని నడపడం అనే అంశంపై పార్లమెంటులో చర్చ పెట్టాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేల జాబితా
ఇక ఆరుకంటే ఎక్కువగా క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉదయభాను సామినేని 18 కేసులు ఎదుర్కొంటుండగా.. శంకర నారాయఫ 6 కేసులు, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏడు కేసులు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏడు కేసులు, రవీంద్రనాథ్ రెడ్డి ఏడు కేసులు, మొహ్మద్ ముస్తాఫా షేక్ 8 కేసులు, కాసు మహేష్ రెడ్డి 6 కేసులు, కొలుసు పార్థసారథి 9 కేసులు, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 8 కేసులు, జోగి రమేష్ 16 కేసులు, జక్కంపూడి రాజా 6 కేసులు, డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 16 కేసులు, దాడిశెట్టి రాజా 15 కేసులు ఎదొర్కొంటున్నారు. ఇక టీడీపీ నుంచి అత్యధికంగా మూడు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వారు గంటా శ్రీనివాస్ మరియు వాసుపల్లి గణేష్ కుమార్ అని ఏడీఆర్ రిపోర్టు పేర్కొంది.