ఢిల్లీకి ముఖ్యమంత్రి జగన్ - "చేదోడు" అక్కడి నుంచే..!!
ముఖ్యమంత్రి జగన్ వినుకొండలో జగనన్న చేదోడు నిధులు విడుదల చేయనున్నారు. ఆ తరువాత రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
ముఖ్యమంత్రి జగన్ రేపు (సోమవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సారి సీఎం కీలక వ్యక్తులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనకు ముందు సీఎం పల్నాడు జిల్లా వినుకొండ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. రెండు నెలల క్రితం పల్నాడు జిల్లా మాచర్లలో చోటు చేసుకున్న పరిణామాల తరువాత తొలి సారి సీఎం ఈ జిల్లాకు వస్తున్నారు. ఆ తరువాత జరిగే సభలో సీఎం పాల్గొంటారు. మధ్నాహ్నం నుంచి సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. 31న ఢిల్లీ వేదికగా కీలక సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది.
పల్నాడు జిల్లాలో సీఎం పర్యటనతో భాగంగా ఉదయం 11 గంటలకు వినుకొండకు సీఎం జగన్ చేరుకుంటారు. పల్నాడు జిల్లా వేదికగా జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. అక్కడ జరిగే సభలో పాలనా పరమైన నిర్ణయాలతో పాటుగా.. రాజకీయ అంశాలపైన జగన్ స్పందించనున్నారు. తాజాగా పాదయాత్రలు.. వివాదాలు..ప్రభుత్వ నిర్ణయాల పైన ముఖ్యమంత్రి ఈ సభ ద్వారా స్పందిస్తారని సమాచారం. దీంతో పాటుగా ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళకు పాలనకు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి వివరించే అవకాశం కనిపిస్తోంది. వినుకొండ నుంచి మధ్నాహ్నం సభ తరువాత సీఎం జగన్ తాడేపల్లి బయల్దేరనున్నారు.
రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ ఢిల్లీ బయల్దేరుతారు. రాత్రికి ఢిల్లీ చేరుకున్న తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 31న ఢిల్లీలోని హోటల్ లీలా ప్యాలెస్ లో వరుస భేటీల్లో సీఎం పాల్గొంటారు. మార్చి 3,4 తేదీల్లో విశాఖ కేంద్రంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ జరగనుంది. ఈ సదస్సుకు జాతీయ - అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఆ సదస్సకు సన్నాహక సమావేశంలో భాగంగా ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్ పలు దేశాల రాయబారుల రౌండ్ టేబుల్ కన్ఫరెన్స్ లో పాల్గొంటారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను వివరించి.. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. ప్రధాని మోదీతోనూ సీఎం జగన్ భేటీ అవుతారని సమాచారం. ఆ తరువాత అదే రోజు రాత్రి తాడేపల్లి తిరుగు పయనం కానున్నారు.