సీఎం జగన్ ఇంట విషాదం: మామ గంగిరెడ్డి మృతి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటిలో విషాదం నెలకొంది. జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతిచెందారు. జగన్ సతీమణి భారతీ తండ్రి గంగిరెడ్డి. ఆయన ప్రముఖ వైద్యులు, పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేవారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చనిపోయారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామం గొల్లల గూడూరు తరలించారు.
ఎంపీపీగా పనిచేసి..
ఈసీ గంగిరెడ్డి వైద్యుడు.. కానీ రాజకీయాల్లో కూడా పనిచేశారు. 2001-2005 వరకు పులివెందుల ఎంపీపీగా పనిచేశారు. రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర కూడా చేశారు. కానీ తర్వాత పేదలకు వైద్యం చేస్తూ.. రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. నిరుపేదలకు వైద్యం అందించేవారు. అందుకే గంగిరెడ్డిని పేదల డాక్టర్ అని పిలుచుకునేవారు.
విషాద వదనం..
గంగిరెడ్డి మృతితో విషాదం నెలకొంది. ఆయన మృతదేహాన్ని వేముల మండలంలో గల గొల్లలగూడూరు తరలించారు. అక్కడ అంత్యక్రియలను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహిస్తారు. అంతిమ సంస్కారాలకు సీఎం జగన్ కుటుంబంతో సహా హాజరవుతారు.
విజయసాయి సంతపాం..
గంగిరెడ్డి మృతిపై విజయసాయి రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి వార్త తెలిసి షాక్నకు గురయ్యానని తెలిపారు. వైద్యునికి, రాజకీయ నేతగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
విజయ్ చందర్ సంతాపం
ఈసీ గంగిరెడ్డి మృతిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ది సంస్థ చైర్మన్ విజయ్ చందర్ షాక్నకు గురయ్యారు. మంచి మనిషి, పేదల వైద్యుడిని కోల్పోయామని చెప్పారు. గంగిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.