పోలవరంపై ప్రధాని మోడీకి జగన్ లేఖ - సవరించిన అంచనాల ఆమోదం కోరుతూ..
పోలవరం జాతీయ ప్రాజెక్టు అంచనాలను ఆమోదించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ ప్రధాని మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ లేఖ రాశారు. ఇందులో జాతీయ ప్రాజెక్టుగా పోలవరం పూర్తి చేయాల్సిన, అందుకు అవసరమైన అనుమతులు ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రానికే ఉందని ఆయన గుర్తుచేశారు. జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించక ముందు నుంచి పోలవరంలో చోటు చేసుకున్న పరిణామాలను ఆయన ప్రధాని మోడీకి తన లేఖలో వివరించారు.
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించక ముందే ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఐదువేల కోట్ల మేర ఖర్చు చేసిందని, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో రాష్ట్ర విభజన, జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రకటన, అంచనాల సవరణ చోటు చేసుకున్నాయని ప్రధాని మోడీకి రాసిన లేఖలో జగన్ గుర్తుచేశారు. మారిన పరిస్ధితుల్లో అంచనా వ్యయం భారీగా పెరిగిందని జగన్ ప్రధానికి తెలిపారు. కేంద్ర జలసంఘం, టెక్నికల్ కమిటీ గతంలోనే ఆమోదించిన రూ.55,656 కోట్ల మొత్తాన్ని కేంద్రం ఆమోదించాలని జగన్ కోరారు.
Recommended Video
2017-18లో రూపొందించిన రెండో సవరణ అంచనాల ప్రకారం అయ్యే ఖర్చును తాము ఇప్పుడు అడుగుతున్నామని, ఇందులో కేంద్రం విధించిన అన్ని నిబంధనలను తాము పాటిస్తున్నట్లు ప్రధాని మోడీకి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉందని జగన్ గుర్తుచేశారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం ప్రాజెక్టును పూర్తిగా నిర్మించడంతో పాటు దానికి అవసరమైన అన్ని అనుమతులు ఇప్పించాల్సి ఉందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు మాత్రమే తీసుకుంటుందన్నారు.