పట్టు వీడని జగన్..వెంట బెట్టుకొని ప్రధాని వద్దకు: అయినా..అమలు కాలేదు: అనధికారిక హోదాలో..!
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తనకు కావాల్సిన అనేక మందిని జగన్ ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించారు. తన కేసుల పేరుతో జైలు శిక్ష అనుభవించిన ఐఏయస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఎలాగైనా గుర్తింపు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. అందుకోసం నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడి అక్కడ అధికారులుగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర..శ్రీలక్ష్మిని రిలీవ్ చేయాలని కోరారు. జగన్ స్వయంగా అడిగే సరికి..కేసీఆర్ వెంటనే రిలీవ్ చేసారు. కానీ, కేంద్రం అడ్డు పడింది. ఇద్దరినీ రిలీవ్ చేయటానికి అనేక కారణాలు చూపించింది.
దీంతో..స్టీఫెన్ తిరిగి తెలంగాణలోనే తన ఉద్యోగంలో చేరి తన పని తాను చేసుకుంటున్నారు. కానీ, శ్రీలక్ష్మి మాత్రం ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ప్రధానిని కలిసిన సమయంలో వెంట బెట్టుకొని మరీ ఇప్పటికి రెండు సార్లు నేరుగా శ్రీలక్ష్మిని రిలీవ్ చేసేలా ఆదేశాలివ్వాలని అభ్యర్దించారు. కానీ, ఇంకా రిలీవ్ ఉత్తర్వులు రాలేదు. దీంతో..శ్రీలక్ష్మి ఏపీ అధికారిగా అనధికారిక హోదాలో ఢిల్లీలోని ఏపీ భవన్ లోనే మకాం వేసారు.
ఒక్క అధికారి కోసం జగన్ విశ్వ ప్రయత్నం
ఐఏయస్ అధికారిణి శ్రీలక్ష్మిని ఎలాగైనా ఏపీ ప్రభుత్వంలోకి తీసుకోవాలని..తన పేషీలో అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలో ఉన్నారు. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం నుండి రిలీవ్ చేయించగలిగారు. కానీ, కేంద్రం కొర్రీ వేసింది. దీంతో..నేరుగా విజయసాయిరెడ్డికి ఆ వ్యవహారం అప్పగించారు. శ్రీలక్ష్మిని వెంట బెట్టుకొని విజయ సాయిరెడ్డి అమిత్ షా తోనూ ఒక దఫా నేరుగా ప్రధానితోనూ సమావేశం అయ్యారు. కేంద్రం రిలీవ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సమయంలో ఇప్పటికే రెండు సార్లు స్వయంగా శ్రీలక్ష్మిని వెంటబెట్టుకొని ప్రధాని వద్దకు వెళ్లారు. రిలీవ్ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కానీ, డీఓపీటీ అధికారులు మాత్రం అనేక కారణాలు అడ్డుగా చెబుతున్నారు. దీంతో..ఇప్పటికీ శ్రీలక్ష్మికి రిలీవ్ ఉత్తర్వులు రాలేదు.
సీబీఐ కేసులే కారణంగా..
శ్రీలక్ష్మిని రిలీవ్ చేయకపోవటానికి ప్రధాన కారణం అమె మీద ఉన్న సీబీఐ కేసులని తెలుస్తోంది. నేరుగా ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించిన సమయంలో వారు హోం శాఖ పరిధిలోనీ డీఓపీటీ అధికారులను ఆరా తీసారు. అయితే, అక్కడి నుండి ఊహించని సమాధానం వచ్చింది. ప్రస్తుతం శ్రీలక్ష్మి ఇంకా కేసుల విచారణ ఎదుర్కొంటున్నారని..ఇప్పుడు రిలీవ్ చేయటానికి బిజెనెస్ రూల్స్ అడ్డువస్తున్నాయని లీగల్ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. సీబీఐ కేసుల్లో ఉన్నప్పుడు అంతర్రాష్ట్ర బదిలీకి ఎలా అవకాశం ఇస్తామని వారు ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని వారు ఏపీ ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇచ్చారు. అయితే, ప్రధాని ప్రత్యేక పరిశీలనగా పరిగణించి రిలీవ్ చేసే అధికారం ఉంటుందని చెబుతున్నారు. కానీ, ప్రధాని ఏపీ ముఖ్యమంత్రి కోరారని శ్రీలక్ష్మి వ్యవహారాన్ని ప్రత్యేకంగా పరిశీలించగలరా..
ఏపీ భవన్ లోనే శ్రీలక్ష్మి మకాం..
డిప్యుటేషన్కు అనుమతి రాకున్నా శ్రీలక్ష్మి ఆంధ్రభవన్లోనే మకాం పెట్టారు. ప్రస్తుతం తెలంగాణ కేడర్ ఐఏఎస్ కు ఇక్కడ కేటగిరీ-1 గది కేటాయించడం పైన చర్చ మొదలైంది. దీనికితోడు ఆమెకు కారు కూడా ఏపీ భవనే సమకూరుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా.. ఆంధ్రకు చెందిన ముఖ్య కార్యదర్శికి ఇచ్చే సదుపాయాలన్నీ తెలంగాణ అధికారిణికి కేటాయిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆమె తరచూ సెలవులపై ఢిల్లీ రావడంవల్ల, ఆమెకు అధికారికంగా తెలంగాణ భవన్లో అకామిడేషన్ ఇవ్వటానికి వీలుపడదని అధికారులు చెబుతున్నారు. కానీ, ఆమెకు ఆంధ్రభవన్లోనే వసతి కల్పించారు. డిప్యుటేషన్ ఖాయమైతే ఆమె నేరుగా జగన్ పేషీలో నియమితులు కావచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.