జగన్ సీరియస్ వార్నింగ్: బిత్తరపోయిన సీనియర్ మంత్రి: నలుగురు జూనియర్లకు హెచ్చరిక..
ఎప్పుడూ నవ్వుతూ..అన్నా..అమ్మా అంటూ పిలిచే ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. కేవినెట్లో ఏరి కోరి తెచ్చుకున్న ఆ అయిదుగురికి సీఎం తనకు ఆగ్రహం తెప్పిస్తే ఎలా ఉంటుందో చూపించారు. తాము ఏం చేసినా ఎక్కడో క్యాంపు కార్యాలయంలో కూర్చొనే ముఖ్యంత్రికి ఎలా తెలుస్తుందిలే అనుకున్న మంత్రులకు ఆధారాలతో సహా ఏం చేసారో వివరించారు. తాను గతంలోనే చెప్పానని..ఇప్పుడు హెచ్చరిస్తున్నానని..మరో సారి ఇదే విధంగా జరిగితే మంత్రులుగా మీరు ఉండరు అని తేల్చి చెప్పేసారు. వారిలో సీనియర్ మంత్రి జగన్ చెప్పిన సమాచారంతో బిత్తర పోయారు. మిగిలిన నలుగురు బతికిపోయాం అంటూ బయటపడ్డారు. ఇంతకీ అసలు ఏం జరిగింది...
తొలి కేబినెట్లోనే జగన్ స్పష్టీకరణ..
ఏపీలో అధికారంలోకి వచ్చిన రోజే స్పష్టం చేసారు. ఆరు నెలల నుండి ఏడాది లోగా జగన్ మంచి సీఎం అని అనిపించు కుంటానని ధీమా వ్యక్తం చేసారు. ఇక కేబినెట్ కూర్పులో సీనియర్లను సైతం పక్కన పెట్టి కొంతమందిని ఏరి కోరి తన కేబినెట్లో అవకాశం ఇచ్చారు. ఇక, తొలి కేబినెట్ సమావేశంలో మంత్రులకు సైతం ఇక స్పష్టత ఇచ్చారు. ఏ ఒక్కరూ అవినీతికి పాల్పడవద్దని స్పష్టం చేసారు. మంత్రులు తమ బంధువుల..పేషీ సిబ్బంది సైతం ఎక్కడా అవకతవకలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ రెండున్నారేళ్లు మంత్రిగా ఉంటాననే ధీమాతో ఉండవద్దని..ఎవరైనా అవినీతి పాల్పడినట్లు తెలిస్తే అదే రోజు చివరి రోజు అవుతుందని చాలా సీరియస్గా చెప్పారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించనని తేల్చి చెప్పారు. సరిగ్గా కేబినెట్ ఏర్పడి నెల రోజులు కూడా ఇంకా పూర్తి కాలేదు. కానీ, మంత్రుల శైలి పట్ల సీఎం రియాక్ట్ కావాల్సి వచ్చింది.
జగన్ను తక్కువ అంచనా వేసారు.
జగన్ కేబినెట్లో మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు. మంత్రుల పని తీరు పైన సీఎం ఎప్పటికప్పడు సమాచారం తెప్పించుకుంటున్నారు. ఇందు కోసం ప్రత్యేక వ్యవస్థ పని చేస్తోంది. కొద్ది రోజులుగా ఏపీలో బదిలీల ప్రక్రియ మొదలు అయింది. నలుగురు మంత్రుల పేషీల్లో మంత్రుల బంధువులు..అనుచరుల హడావుడి ఎక్కువగా ఉంది. ఇద్దరు మంత్రుల అనుచరులు నేరుగా పైరవీల కోసం తమ మంత్రుల ద్వారా ఇతర శాఖల మంత్రులకు సిఫార్సు చేయించి నట్లుగా సమాచారం అందింది. ఇక మహిళా మంత్రి దగ్గరి బంధువు మొత్తం మంత్రికి సంబంధించిన వ్యవహారాలు తానే చూసుకుంటానంటూ హల్చల్ చేస్తున్నారు. ఉద్యోగులు ప్రాపర్ ఛానల్ ద్వారా బదిలీల కోసం మంత్రుల దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటని అధికారులను సీఎం ప్రశ్నించారు. ప్రత్యేక కేసుల్లో మినహాయిస్తే ఇంత మంది మంత్రు ల కోసం అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆరా తీసారు. వారం రోజులుగా సచివాలయంలో తిరునాళ్లను తలపించేలా జన సందోహం ఉండటం చూస్తే ఎవరికైనా అక్కడ జరిగేది ఏంటో అర్దమైపోతుంది.
నవ్వతూ ఉండే సీఎం ..ఒక్కసారిగా..
ఎటువంటి క్లిష్ట సమయంలోనూ నవ్వుతూ కనిపించే సీఎం జగన్ ఈ వ్యవహారంలో మాత్రం ఒక్కసారిగా సీరియస్ అయ్యారని విశ్వసనీయ సమాచారం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో కీలక నిర్ణయాల ద్వారా అవినీతి అధికారులను తప్పించటం పైన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ను సీఎం అభినందించారు. అదే సమయంలో రాజధాని గురించి ఈ మధ్య కాలంలో అధికంగా ప్రస్తావిస్తున్న ఓ సీనియర్ నేతను ..అన్నా మీకంటే సమర్ధవంతంగా పని చేసే వారు ఉన్నా మీ మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించాను అంటూ ..తాను చెప్పదలచుకుంది చెప్పేసారు. ఇక, అవినీతి చేస్తున్నారనే విషయం తన నోటితో చెప్పకుండా..వారి పేషీల్లో ఏ సమయంలో ఏం జరిగిందో వివరిస్తూ..ఈ పద్దతి మార్చుకోవాలని ..లేకపోతే ఇక చెప్పాల్సిన అవసరం కూడా ఉండదని జగన్ ఇద్దరు మహిళా..మరో ఇద్దరు జూనియర్ మంత్రులకు ముఖ్యమంత్రి నిర్మొహమాటంగా చెప్పేసారు. కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా చూసుకోవాలని ఇదే చివరి హెచ్చిరక అంటూ ఆ మహిళా మంత్రిని సీఎం హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు జగన్ తన మంత్రులకు ఇచ్చిన వార్నింగ్ పైన సచివాలయంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.