మంత్రులకు జగన్ సీరియస్ వార్నింగ్: తేడావస్తే పదవులు ఊడతాయి..మీ జాతకాలు నాదగ్గరున్నాయంటూ..!
అమరావతి: ఈ రోజు ఏపీ కేబినెట్ ముగిసింది. ఏపీ కేబినెట్ ముగిసిన తర్వాత సీఎం జగన్ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎ్ననికలపై ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మంత్రులకు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. అంతేకాదు తేడా వస్తే మంత్రి పదవులు ఊడతాయంటూ సీఎం గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మంత్రుల సొంత నియోజకవర్గాల్లో ఓటమి పొందితే ఐదు నిమిషాలు కూడా ఆలోచించనని జగన్ స్పష్టం చేశారు.
పని తీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఉండవని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. రేపటి నుంచి ఎనిమిదో తేదీ వరకు కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలని సూచించారు. కోడ్ వచ్చిన వెంటనే పూర్తి సన్నద్ధతతో రంగంలోకి దిగాలన్నారు. పార్టీ,ప్రభుత్వం,పాలనా అంశాలపై మంత్రులతో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత ఇంఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులదే అని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని చెప్పిన జగన్... ఈ బాధ్యతను ఎమ్మెల్యేలు జిల్లా మంత్రులు ఇంఛార్జ్ మంత్రులు తీసుకోవాలని సూచించారు.
Recommended Video
జిల్లాలో పార్టీ నాయకత్వం మధ్య ఉన్న గ్రూపు తగాదాలు నేపథ్యంలో వాటిని చక్కబెట్టాలని మంత్రులకు సూచించారు సీఎం జగన్.మద్యం,డబ్బు పంపిణీ కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పారు. ఎక్కడైనా ఫలితాల విషయంలో తేడా వస్తే మంత్రులు వెంటనే రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అదేసమయంలో ఎమ్మెల్యేలకు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని సున్నితమైన వార్నింగ్ ఇచ్చారు సీఎం జగన్. ఈ నెల 9 నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో ఈలోపే పార్టీ నేతలతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీఎం సూచించారు.