ఆనం వ్యాఖ్యల వెనుక..! చంద్రబాబు తో భేటీ ఎఫెక్టేనా: అసలు టార్గెట్ మంత్రి అనిల్..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో నెల్లూరు జిల్లా సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు అధికార వైసీపీలో కలకలానికి కారణమవుతున్నాయి. ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నుండి ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. అప్పుడప్పుడు అసెంబ్లీలో ప్రభుత్వానికి మద్దతుగా..కొన్ని సందర్భాల్లో టీడీపీకి వ్యతిరేకంగా బయట మాట్లాడటం మినహా పార్టీలో అంత యాక్టివ్ గా కనిపించటం లేదు. ఇక, తాజాగా ఆయన ఎవరి పేర్లు నేరుగా ప్రస్తావింకపోయినా..ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. దీని పైన ముఖ్యమంత్రి సైతం సీరియస్ అయ్యారు. ఇదే రకంగా మాట్లాడితే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరిక పంపినట్లు తెలుస్తోంది. అయితే.. నెల్లూరు జిల్లా వైసీపీలో మాత్రం వర్గ పోరు తీవ్రంగా కనిపిస్తోంది. అసలు ఆనం చేసిన వ్యాఖ్యలు వెనుక లక్ష్యం ఎవరు..ఆయన ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేసారు..దీని పైన వైసీపీ అధినాయకత్వం ఆరా తీస్తోంది.
చంద్రబాబు తో భేటీ అయినాకేనా..!
నెల్లూరు జిల్లా సీనియర్ నేత..వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఆనం వ్యాఖ్యల మీద వైసీపీ సీనియర్ నేత విజయ సాయిరెడ్డి ... మంత్రి అనిల్ తీవ్రంగా స్పందించారు. అయితే, జిల్లాలో ఇద్దరు జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వటం..తనకు ఎటువంటి ప్రాధాన్యత లేకపోవటం పైన ఆనం రామనారాయణ రెడ్డి అసహనంతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల చిత్తూరు పర్యటనకు వెళ్లిన చంద్రబాబుతో రేణిగుంట విమానాశ్రయంలో ఆనం భేటీ అయ్యారన్న ప్రచారమూ వైసీసీ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాహాటంగా ఆనం వ్యాఖ్యలు కలకలాన్ని రేపాయి. దీని వెనుక వాస్తవాలను తెలుసుకొనేందుకు వైసీపీ అగ్ర నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఏ విధంగానూ ఇటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తనతో సహా ఎవరైనా ఒకటేనని, క్రమశిక్షణా చర్యలు తప్పవని జగన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.
అసలు టార్గెట్ మంత్రి అనిల్..!
నెల్లూరు పట్టణ అసెంబ్లీ నియోజకవర్గంలో రౌడీలూ గుండాలూ ఎక్కువయ్యారు... ప్రజలు మనోవేదనకు గురవుతున్నారు... భూకబ్జాలూ... సెటిల్మెంట్లూ పెరిగిపోయాయంటూ వైసీపీ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యల అసలు లక్ష్యం మంత్రి అనిల్ కుమార్ గా కనిపిస్తోంది. జిల్లాలో మంత్రి అనిల్ ఏ నేతను కలుపుకుపోవటం లేదని..కేవలం నెల్లూరు సిటీతో పాటుగా రూరల్ నియోజకవర్గాల్లో మినహా ఆయన మంత్రి అయినాక ఇప్పటి వరకు పర్యటనలు కూడా చేయలేదని నెల్లూరు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో సీనియర్లను కాదని అనిల్ కు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇవ్వటం కూడా పార్టీలోని కొందరు సీనయిర్లకు రుచించటం లేదని ప్రచారం. దీని ద్వారా నెల్లూరు జిల్లాలోని మొత్తం 10 సీట్లు..ఎంపీ స్థానం గెలిచిన వైసీపీలో ఇప్పుడు వర్గ పోరు..నేతల మధ్య ఆధిప్యత పోరు కనిపిస్తోంది. ఈ పరిస్థితిని చక్కబెట్టే వ్యవహారం సీఎం జగన్ పార్టీ ముఖ్య నేత విజయ సాయి రెడ్డికి అప్పగించారు.
బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ ప్రచారం
ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ నేత. అయితే, వైసీపీ లో మాత్రం కొత్తగా వచ్చారు. ఆయన తో బీజేపీలో రాష్ట్ర స్థాయిలో కీలక పోస్టులో ఉన్న నేత టచ్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఆయన పార్టీ మారే ఆలోచన మాత్రం లేదని మరో వాదన. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండటంతో ఏ మాత్రం తొందర పడినా ..అనర్హత వేటు పడటం ఖాయం. దీంతో..కేవలం జిల్లాలో ఉన్న పరిస్థితిని నేరుగా ముఖ్యమంత్రికి చెప్పే అవకాశం లేకపోవటంతోనే..ఆయన ఈ విధంగా ఓపెన్ అయ్యారని చెబుతున్నారు. ఇక, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న సమయంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చే విధంగా..అందునా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుండి వ్యాఖ్యలు చేయటం..ఇప్పుడు సీఎం సీరియస్ అవ్వటంతో ఈ వ్యవహారం ఎటు టర్న్ అవుతుందనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.