జగన్ తిరుమల టూర్- 23న శ్రీవారికి పట్టు వస్త్రాలు- 24న యడ్యూరప్పతో కలిసి...
సీఎం జగన్ తిరుమల టూర్ ఖరారైంది. తిరుమలలో జగన్ రెండు రోజుల పాటు ఉంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ఈ నెల 23న జగన్ తిరుమల రానున్నారు. ధ్వజారోహణం సందర్భంగా జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆ తర్వాత మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈ నెల 23న మధ్యాహ్నం 3.50 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్న జగన్... రోడ్డు మార్గంలో 5 గంటలకు పద్మావతి గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. అనంతరం సాయంత్రం ఆరు గంటల 20 నిమిషాలకు జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం ఈ నెల 24న ఉదయం 8 గంటల 10 నిమిషాలకు తిరుమలలో కర్ణాటక సత్రాల భవన నిర్మాణానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలిసి ఆయన భూమిపూజ నిర్వహించనున్నారు. అనంతరం ఆయన అమరావతికి బయలుదేరుతారు.
శ్రీవారి దర్శనం సందర్భంగా డిక్లరేషన్ సమర్పణపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో జగన్ తిరుమల రాక సందర్భంగా ఈసారి ఉత్కంఠ నెలకొంది. గతంలో డిక్లరేషన్ సమర్పించని జగన్.. ఈసారి కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు, అబ్దుల్ కలాం కంటే ఆయన గొప్పవారా అంటూ బీజేపీ నేతలు పరస్పరణ ఆరోపణలకు దిగుతున్నారు. టీడీపీ కూడా డిక్లరేషన్ ఇవ్వకపోతే తిరుమల రావాల్సిన అవసరం లేదంటూ జగన్పై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి జగన్ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.