ఇంటర్పోల్ అదుపులోకి సీఎం జగన్ త్వరలోనే: బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల పలువురు వ్యాపారవేత్తలపై జరిగిన ఐటీ దాడులను టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబుపై బురదజల్లే యత్నం..
ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ఐటీ దాడులు ఎవరిపై జరిగాయో వారిక రివర్స్ టెండరింగ్ ద్వారా సీఎం జగన్ పోలవరం పనులు కట్టబెట్టారని, దీన్ని బట్టి చూస్తే ఎవరెంటో తెలుస్తోందని అన్నారు. అనవసర విషయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
జగన్ ఓ అరాచకవాది...
సీఎం జగన్ ఓ అరాచకవాది అని బుచ్చయ్య చౌదరి దుయ్యబట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మి ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ప్యాకేజీ విషయంలో ఒప్పించలేకపోయారి, ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయడం లేదిన ధ్వజమెత్తారు.
వివేకా హత్య కేసులో వెనక్కి ఎందుకు తగ్గారు..
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో గతంలో సీబీఐ విచారణ కోరిన జగన్.. ఇప్పుడు వెనక్కి తగ్గడంలో ఆంతర్యమేంటని చౌదరి ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇంటర్పోల్ అధికారులు త్వరలో అదుపులోకి తీసుకోవడం ఖాయమని బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యానించారు. ఇంతకుముందు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా వైసీపీ నేతలు, సాక్షి మీడియాపై తీవ్రస్తాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. వైసీపీ నేతలు, సాక్షి మీడియాను వదిలిపెట్టేది లేదని, పరువునష్టం దావా వేస్తామన్నారు.
జగన్ కుటుంబంలో నలుగురు ముద్దయిలు.. వైఎస్ కూడా..
సీఎం జగన్, ఆయన పేటీఎం బ్యాచ్.. ఐటీ దాడుల్ని చంద్రబాబుకు అంటగట్టాలని చూశారని.. అయితే, తాజాగా వెలువడిన ఐటీ శాఖ పంచనామా నివేదికో వారి నోళ్లు మూతపడ్డాయని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. ఐటీ శాఖ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేదని ఎద్దేవా చేశారు. జగన్ కుటుంబంలో నలుగురు ముద్దాయిలుగా ఉన్నారని ఆరోపించారు. మొత్తం వైసీపీలో 76 మంది క్రిమినల్స్ ఉన్నారని, వైఎస్ఆర్ బతికుంటే ఆయన కూడా ఒక ముద్దాయి అయ్యేవారని అన్నారు. ఐటీ దాడులపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేశారని కూన రవికుమార్ మండిపడ్డారు.