ఎంపీపై సీఎం జగన్ సీరియస్... ఇంగ్లీష్ విద్యపై వార్నింగ్....!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇంగ్లీష్ మీడియం విద్యను రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు ఇప్పటికే పలు విమర్శలు చేస్తుండగా.. స్వంత పార్టీ ఎంపీ పార్లమెంట్ సాక్షిగా పార్టీ నిర్ణయాన్ని సమర్థించకపోవడంతోపాటు తెలుగును కాపాడాలంటూ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో సదరు ఎంపీపై సీఎం జగన్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయానికి ఎవ్వరు వ్యతిరేకంగా మాట్లాడిన తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
ఇంగ్లీష్ మీడియంపై అమలుకు రాష్ట్రం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో ఒకటవ తరగతి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే... దీంతో తెలుగు బాషపై పలువురు మేధావులతో పాటు ప్రతిపక్ష టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా... తన నిర్ణయం నుండి వెనక్కి తగ్గని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియంలో భోధనను పకడ్భందిగా అమలు చేసేందుకు ఓ ఐఏఎస్ అధికారిని కూడ ప్రత్యేకంగా నియమించారు.
ఎంపీ వ్యాఖ్యలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నాయనే భావన
అయితే ప్రభుత్వ నిర్ణయంపై పార్లమెంట్లో సైతం చర్చించాలని టీడీపీ ఎంపీ కేశినేని పట్టుబట్టారు. అయితే ఇదే సందర్బంలో అధికార పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పార్లమెంట్లో మాట్లాడారు. ఈనేపథ్యంలోనే తెలుగుకు ప్రాచీన హోదా ఉందని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు తీసుకుంటుందని చెప్పారు. ఇందుకోసం తెలుగు అకాడమీని సైతం పునరుద్దరించిందని తెలిపారు. గత ప్రభుత్వం తెలుగును నిర్వీర్యం చేసిందని ఆయన ప్రస్తావించారు. దీంతో పాటు దీన్ని కేంద్రం కూడా కాపాడే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. అయితే ఆయన మాట్లాడిన తీరును ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉందనే అభిప్రాయంతో పార్టీ నేతలు ఉన్నారు.
ఎంపీ వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్
ఈ నేపథ్యంలో ఎంపీ వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశాలు ఉండడంతో పాటు ఇతర పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో... ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సీఎం జగన్ మోహన్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జిగా ఉన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో ఆయన చర్చినట్టు తెలుస్తోంది. చర్చలో ఎంపీ వ్యాఖ్యలను ప్రస్తావించినట్టు సమాచారం. ఇంగ్లీష్ మీడియంపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా... పేద వర్గాల పిల్లల అభివృద్దిని అడ్డుకోవడమేనని సీఎం జగన్ అభిప్రాయపడినట్టు సమాచారం. దీంతో వ్యతిరేకంగా మాట్లాడినా... పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇలాంటీ సంఘటనలు పునరావృతం కాకుండా పార్టీ నేతలు వ్యవహరించాలని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తుంది.