రాజ్య సభ సీట్ల కేటాయింపు: సీఎం జగన్ ,కేసీఆర్ లకు రిస్కీ టాస్క్
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ సీట్లకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది . తెలంగాణా లో రెండు సీట్లకు, ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలకు ఎన్నికల ప్రహసనం మొదలు అయ్యింది. గతంలోనే షెడ్యూలును విడుదల చేసిన ఎన్నికల సంఘం శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చెయ్యటంతో అధినేతలకు ఆశావహుల తాకిడి పెరుగుతుంది. ఎవరి ఆబ్లిగేషన్స్ వారు చెప్తూ అధినేతలను ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు ఇరు రాష్ట్రాలలోని నేతలు .
శుక్రవారం నుంచి మార్చి 13వ తేదీ వరకు రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ కార్యదర్శులు నామినేషన్లు స్వీకరిస్తారు. అయితే అధినేతలు ఎవరి పేరు సూచిస్తే వారే రాజ్య సభ సభ్యులు అయ్యే అవాక్షం ఉంటుంది. ఇందులో ఎలాంటి పోటీ ఉండబోదు అనేది అందరికీ తెలిసిన విషయమే . మార్చి 18న అధికారికంగా ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు అయిన వారి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది . కానీ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎవరి పేర్లు ఫైనల్ చేస్తే వారే రాజ్యసభ సభ్యులుగా పెద్దల సభకు వెళ్లనున్నారు.
ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న నేపధ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ నేతలకే ఆయా స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఈ స్థానాలలో అభ్యర్థుల ఎంపిక రెండు అధికార పార్టీల అధినేతలైన జగన్, కేసీఆర్ లకు పెద్ద తలనొప్పిగా తయారైంది. రెండు పార్టీల్లో ఆశావహుల పోటీ విపరీతంగా ఉంది. తెలంగాణలో ఖాళీ అవుతున్న స్థానాలు రెండే అయినా పదుల సంఖ్యలో ఆశావహులు పోటీ పడుతున్నారు. ఇక ఏపీలోనూ అధికార పార్టీలో ఆశావహుల జాబితా పెద్దదిగానే ఉంది.
తెలంగాణా రాష్ట్రం లోనూ సీఎం కేసీఆర్ ను ప్రసన్నం చేసుకోటానికి ఎవరి లాబీయింగ్ వారు చేస్తున్నారు. మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాం నాయక్, గుండు సుధారాణి తదితరులు జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒకవేళ రాజ్యసభ , లేదంటే ఎమ్మెల్సీ గా అవకాశం ఇవ్వాలని పైరవీలు చేస్తున్నారు.ఇక కవితకు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు కూడా రాజ్యసభ ఇచ్చే అంశంపై కేసీఆర్ చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదిఏమైనా అత్యంత ఆసక్తికరంగా మారిన తెలుగు రాష్ట్రాల రాజ్యసభ ఎన్నికల సీట్లు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎవరకి ఇస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది .