కేసీఆర్ ఇచ్చిన ఫోన్ నెంబర్కు ఒక్కరోజే 2,500 కాల్స్, రెట్టింపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి భారీగా వినతులు, ఫిర్యాదులు వస్తున్నాయి. లంచాలు, అవినీతి పైన ఫిర్యాదులు, సమస్యలపై వినతులు చేయడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన వరంగల్ పర్యటన సందర్భంగా ఫోన్ నెంబర్ (040-23454071) ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి ప్రజల నుండి భారీగా స్పందన వచ్చింది.
పైనిచ్చిన ఫోన్ నెంబర్కు ఒక్కరోజే ఇరవై అయిదు వందల నుండి మూడువేల ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇవి ముప్పై లైన్లు ఉన్నాయి. భారీ స్పందన నేపథ్యంలో వాటిని రెట్టింపు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఫించన్లు మంజూరు కాలేదని, డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేస్తామని అన్నారు.. ఎప్పుడు చేస్తారని... ఇలా ముఖ్యమంత్రి ఇచ్చిన ఫోన్ నంబర్స్కు కాల్స్ వెల్లువెత్తుతున్నాయి.
సోమవారం నాటికి వివిధ జిల్లాల నుంచి 2,534 మంది తమ సమస్యలపై ఫోన్ చేశారు. ఇప్పుడు 30 లైన్లు పని చేస్తున్నాయి. మరో 30 లైన్లను ఏర్పాటు చేసి, ఒకేసారి 60 మంది మాట్లాడే అవకాశం కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయమని ముఖ్యమంత్రి ఫోన్ నంబర్ చెప్పారు.
అయితే ప్రభుత్వానికి సంబంధించి ఏ శాఖకు సంబంధించిన ఫిర్యాదునైనా, సమస్యనైనా ఈ నంబర్కు ఫోన్ చేసి చెప్పవచ్చునని అధికారులు ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. 2534 మంది ఫోన్ చేయగా, వారికి ఫిర్యాదు అందినట్టు సమాచారం పంపించారు. త్వరలోనే ఈ నంబర్నో టోల్ఫ్రీ నంబర్గా మార్చనున్నట్టు అధికారులు తెలిపారు.
తమ సమస్యను ఎస్ఎంఎస్ ద్వారా కూడా పంపించే సౌకర్యం కల్పిస్తారు. మెయిల్ అడ్రస్ను రెండు రోజుల్లో ప్రకటిస్తారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి వాటికి పరిష్కారాన్ని వివరించే విధంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ల ద్వారా కూడా ప్రజలు తమ సమస్యలను ఈ నంబర్కు వివరించవచ్చు.