సీఎం జగన్ కు తెలంగాణా సీఎం కేసీఆర్ సర్ప్రైజింగ్ విషెస్, కేటీఆర్ ట్వీట్ తో ఫ్యాన్స్ ఫిదా, ఏపీలో సంబరాలు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒకపక్క వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేకులు కట్ చేస్తూ బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తుంటే, మరోపక్క సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువగా మారాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు ఇప్పటికే శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
బలమైన ఆకాంక్ష మరియు సాధించే పట్టుదల ఉన్న సిఎంకు బర్త్ డే విషెస్ .. కేసీఆర్ ట్వీట్
బలమైన ఆకాంక్ష మరియు సాధించే పట్టుదల ఉన్న సిఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు . వైయస్ జగన్ గారు ఏపీప్రజల అవసరాలను ఆకాంక్షలను మీరు తీరుస్తారని , మీ నాన్న లాగా బలమైన నాయకుడిగా అవుతారని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు. అంతేకాదు కళ్ళనిండా ప్రేమతో కూడిన ఎమోజీ లను ట్వీట్ చేశారు సీఎం కేసీఆర్. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజాసేవలో జీవితాంతం కొనసాగాలి అన్నా.. కేటీఆర్ ట్వీట్ .. ఫ్యాన్స్ ఫిదా
గౌరవనీయులైన సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్ మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజాసేవలో జీవితాంతం కొనసాగాలి అన్నా.. అంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్, సీఎం జగన్ ను అన్నా అని సంబోధించడం వైసీపీ శ్రేణులను సంతోషంలో ముంచెత్తింది . దీంతో వైయస్సార్సీపి కార్యకర్తలు భవిష్యత్తు యువ సీఎంలు అంటూ ఇటు జగన్ ను అటు కేటీఆర్ ను తెగ పొగుడుతున్నారు.
జగన్ జన్మదినాన సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఫ్యాన్స్
నిన్నమొన్నటిదాకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించిన అనేక సమస్యలపై, నీటి వాటాలపై, ఆఖరికి బస్సులో రవాణా విషయంలో కూడా పెద్ద ఎత్తున యుద్ధాలే జరిగిన సమయంలో, తాజాగా కేటీఆర్ ట్వీట్ రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు పునాది వేస్తుంది అన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది. మరోవైపు సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
జగన్ బర్త్ డే కి భారీగా ర్యాలీలు , రక్తదాన శిబిరాల నిర్వహణ
ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి చారిత్రాత్మక పథకాలను అందిస్తూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు తీసుకుపోతున్న సీఎం అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కొనియాడుతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేరుస్తూ ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ జగన్ జన్మదిన వేడుకలకు శ్రీకారం చుట్టిన వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు.
Recommended Video
సామూహిక ప్రార్ధనలు ,అన్నదాన కార్యక్రమాలు
జగన్ పుట్టినరోజున సామూహిక ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు . ప్రజలకు స్వీట్లు పంచుతూ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ సెలబ్రేట్ చేస్తున్నారు. జననేత జగనన్న అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలోనూ అభిమానులు పెద్ద ఎత్తున జగన్ జన్మదిన వేడుకలకు సంబంధించి ఫోటోలను, వీడియోలను, పాటలను పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి సీఎం జగన్ పుట్టిన రోజు వైసీపీ నేతల్లో , శ్రేణుల్లో జగన్ పట్ల ఉన్న అభిమానం వ్యక్తం చేసుకోవటానికి అవకాశం ఇచ్చింది .