జగన్ తన తండ్రిని మించిపోయాడు : కేసీఆర్ సీరియస్ : తాడో పేడో తేల్చుకుందాం..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. కొద్ది కాలం క్రితం వరకూ ఇద్దరు ముఖ్యమంత్రులు అలయ్ భలయ్ చేసుకున్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా తామిద్దమే అంతరాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ప్రగతి భవన్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్..అదే విధంగా అమరావతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోకలు సాగాయి. సుదీర్ఘ సమావేశాలు జరిగాయి. కానీ, సడన్ గా ఇద్దరి మధ్య ఆ సమావేశాలు నిలిచిపోయాయి.
సడన్ గా గ్యాప్.. రాకపోకలు బంద్..
రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల పంచాయితీ సైతం రోజుల తరబడి సాగింది. చివరకు తెలంగాణ ఆర్టీసీ అధికారుల డిమాండ్ మేరకు ఏపీ అధికారులు అంగీకారం తెలిపిన తరువాత రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగటం ప్రారంభించాయి. ఇక, ఈ మధ్య కాలంలో ఏపీ నుండి వచ్చే అంబులెన్సులను తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. ఆ సమయంలోనూ ముఖ్యమంత్రులు స్పందించలేదు. కోర్టు జోక్యంతో ఆ సమస్య పరిష్కారం అయింది.
ఇక, రెండు ప్రభుత్వాలు కలిసి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు వీలుగా ఉమ్మడి ప్రాజెక్టు ఆలోచన చేసారు. ఆ ఆలోచనలు మధ్యలోనే ఆగిపోయాయి. కానీ, తెలంగాణకు నష్టం చేసే విధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రాజెక్టులు చేపడుతున్నారని..నీళ్లు తీసుకుంటున్నారంటూ తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేసినా...కేసీఆర్ ఓపెన్ అవ్వలేదు. ఇదే సమయంలో జగన్ స్పందించారు. తెలంగాణకు నష్టం లేకుండా మిగులు జలాలను మాత్రమే ఏపీ సద్వినియోగం చేసుకుంటుందని చెప్పుకొచ్చారు. దీంతో..అప్పట్లో ఈ సమస్య సద్దుమణిగంది.
ప్రాజెక్టుల వార్..జగన్ పై ఆగ్రహం
తిరిగి ఆర్డీఎస్ వద్ద ఏపీ చేస్తున్న ప్రాజెక్టు నిర్మాణాల పైన తెలంగాణ మంత్రులు..నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇదే విషయంపైన తాజాగా జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలోనూ చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి తీరు పైన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
జగన్ తన తండ్రి వైఎస్ కంటే మొండిగా వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఒప్పందాలను ఉల్లంఘించేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కృష్ణా బేసిన్లో ఏపీ సర్కారు అక్రమ ప్రాజెక్టులు చేపడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం అయింది. ఈ విషయంలో నాడు వైఎస్ కంటే నేడు జగన్ దూకుడుగా వెళ్తున్నారంటూ వ్యాఖ్యలు చేసారని సమాచారం.
తాడో పేడో తేల్చుకోవాల్సిందే..
దీని పైన మౌనంగా ఉండ కూదడనే అభిప్రాయం వ్యక్తం అయింది.ఆంద్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిందని, సుప్రీం కోర్టులో కేసులు వేసిందనీ నీటిపారుదల శాఖ కేబినెట్ కు తెలిపింది. ఎన్ జీ టీ తో పాటు కేంద్రం కూడా ఆదేశించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని, కేబినెట్ తీవ్రంగా ఖంఢించింది.
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన అక్రమ ప్రాజెక్టుల వలన.. పాలమూరు, నలగొండ,ఖమ్మం,వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు.. హైద్రాబాద్ కు తాగునీరు విషయంలో తీవ్ర అన్యాయం జరగనున్ననేపథ్యంలో., న్యాయంగా దక్కాల్సిన కృష్ణా నీటి వాటాను దక్కించుకోవాలని నిర్ణయించింది.
Recommended Video
ఢిల్లీ కేంద్రంగా ఆందోళనకు సిద్దం
అవసరమైతే పార్టీ ఎంపీలు..ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఢిల్లీలో ధర్నా చేయాలనే ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఏపీకి ధీటుగా తెలంగాణలోనూ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని పలువురు మంత్రులు సూచించారు. అయితే, న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిద్దామని, వాస్తవాల ప్రాతిపదికన ముందుకెళ్దామనే నిర్ణయానికి తెలంగాణ కేబనెట్ వచ్చింది. ఇక, తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాల పైన ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.