నా భర్తపై కేసీఆర్ కక్ష కట్టారు: రేవంత్ భార్య, టీడీపీ నేతలపైనా ఆగ్రహం?
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం నాడు ఉదయం లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన తమ పార్టీకి చెందిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేల పైన రేవంత్ సతీమణి గీత అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
ఇంతమంది రాజకీయ నాయకులు, సీనియర్లు ఉండి తన భర్తను ఇరికించారని, ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని ఆమె మండిపడినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ టీడీపీ నేతలు పరామర్శకు ఇంటికి వెళ్లారు.
తన భర్తను కావాలనే కొందరు ఇరికించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తన భర్త పైన కక్ష కట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తన భర్తను తెరాస ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏదో రకంగా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడుతోందని తాము ముందే ఊహించామని చెప్పారు. ఆమెను ఓదార్చేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించారు. రేవంత్ కేసు నుండి బయటపడతారని, తామంతా ఆయన వెనకే ఉన్నామని చెప్పారు.