సరిపోదు, విభజనపై కిరణ్ రెడ్డి సుప్రీంకెళ్లాలి: పయ్యావుల
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యహరిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర సమైక్యత కోసం ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్లలోనే రాష్ట్రాన్ని సమక్యంగా ఉంచుతానని చెబుతున్నారని పయ్యావుల విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ ద్వారా తెలియజేయాలని సిఎంను డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై వెంటనే సిఎం కిరణ్ కుమార్ రెడ్డి న్యాయశాఖచే సమీక్షింపజేయాలని, సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించాలని డిమాండ్ చేశారు. ఆ నివేదికను అసెంబ్లీ ముందు ఉంచాలని తెలిపారు.
ఆర్టికల్ 3, 4 ప్రకారం కేంద్రం రాష్ట్ర విభజన చేస్తోందని చెప్పుకుంటోందని, అయితే ప్రస్తుతం ఆ రెండు ఆర్టికళ్లు న్యాయ సమీక్షలో ఉన్నాయని తెలిపారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లోని ముళ్ల పెరియార్ డ్యాం వివాదం తర్వాత ఆర్టికల్ 3, 4లు న్యాయసమీక్షలో ఉన్నాయని అన్నారు.
అందువల్ల ముళ్ల పెరియార్ డ్యాం కేసును ప్రస్తావిస్తూ ప్రభుత్వం కోర్టులో సూట్ వేయాలని పయ్యావుల డిమాండ్ చేశారు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం ఏ విధంగా తీసుకుంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే రాజధాని హైదరాబాద్లోని ఆస్తుల విలువను ఎలా అంచనా వేస్తారని ప్రశ్నించారు.