పదవిలో ఉండే అర్హతలేదు, దగాకోరు: కిరణ్ రెడ్డిపై కెకె
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి ఒక్క నిమిషం కూడా పదవిలో ఉండే అర్హత లేదని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవరావు అన్నారు. ఆయన శనివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ ఒక ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడడం దారుణమని అన్నారు.
సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని కేశవరావు ఆరోపించారు. సీమాంధ్ర ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు కాదని పెట్టుబడిదారుల ఉద్యమాలని అన్నారు. తెలంగాణ ఉద్యమాలు జరిగినప్పుడు ఒకలా, సీమాంధ్రలో ఉద్యమాలు జరుగుతున్నప్పుడు మరోలా సిఎం, డిజిపిలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం జరిగినప్పుడు ఆంక్షలు, నిర్బంధాలతో అడ్డుకున్న ముఖ్యమంత్రి, డిజిపిలు సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమానికి సహకారం అందించడమేంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ సీమాంధ్ర మంత్రుల మాటలే వింటున్నారని, తెలంగాణ మంత్రులను పట్టించుకోవడం లేదని అన్నారు. సీఎం ఈ విధంగా ప్రవర్తిస్తుంటే తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నారో తెలియడం లేదని కేశవరావు చెప్పారు.
ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్రపై అవగాహన లేదని కేశవరావు అన్నారు. అవగాహన రాహిత్యంతోనే చరిత్రను వక్రీకరించారని ఆయన విమర్శించారు. విభజన తర్వాత సీమాంధ్రలో నీటి సమస్యలు వస్తాయన్నసిఎం వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
విభజన జరిగితేనే నీటి సమస్యలు వస్తాయనుకుంటే.. 1956కు ముందు సీమాంధ్రలో నీళ్లు లేవా అని ప్రశ్నించారు. నీటి సమస్యలపై మాట్లాడిన కిరణ్కుమార్ తన వ్యాఖ్యల్లో సీమాంధ్ర పాలకుల జల దోపిడీని ఒప్పుకున్నారని అన్నారు. రాష్ట్ర విభజనతో సమస్యలు వస్తాయంటున్న ముఖ్యమంత్రికి అవి చర్చించుకుంటే పరిష్కారమయ్యేవని తెలియదా అని కేశవరావు ప్రశ్నించారు.
కిరణ్వి దగాకోరు మాటలు: మందా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి దగాకోరు మాటలు మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు మందా జగన్నాథం అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. విభజనతో నీటి సమస్యలు వస్తాయని, విద్వేషాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి కిరణ్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న కిరణ్ సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.