మోడల్ మెట్రో కోచ్ను ఆవిష్కరించిన సిఎం కిరణ్ రెడ్డి
హైదరాబాద్: మహానగరానికి మణిహారంగా రూపుదిద్దుకుంటున్న మెట్రో రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మెట్రో రైలు కోచ్ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. నెక్లెస్ రోడ్డులోని పివి జ్ఞానభూమి ఎదురుగా ఉన్న ప్రదేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోచ్ను సిఎం ఆవిష్కరించారు. ఔటర్ రింగ్ రోడ్డు, పివి ఎక్స్ ప్రెస్ హైవే మాదిరిగానే మెట్రో రైలు కూడా నగరానికి మణిహారం కానుందని సిఎం అన్నారు.
కోచ్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ పాల్గొన్నారు. మెట్రో కోచ్ ఆవిష్కరణ అనంతరం ప్రజల సందర్శనకు అనుమతివ్వడంతో కోచ్ను తిలకించేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. కోచ్ అచ్చం లగ్జరీ కారును తలపిస్తోందని నగర వాసులు ముచ్చటపడుతున్నారు. కొరియాకు చెందిన హుండాయ్-రోట్టర్ డామ్ కంపెనీ ఈ కోచ్ను హైదరాబాద్ మెట్రోకు అందించింది.
మెట్రో రైలు కోసం మొత్తం 57 రైళ్లకు కావాల్సిన 171 బోగీలను ఆర్డర్ చేశారు. అందులో మొదటిది కొరియా నుంచి చెన్నైకి, అక్కడి నుంచి హైదరాబాద్కు చేరుకుంది ఈ కోచ్. మెట్రోరైలు మొదటి దశ నాగోలు నుంచి మెట్టుగూడ వరకు 2015మార్చిలోగా పట్టాలెక్కి నగర వాసులకు అందుబాటులోకి రానుంది.
మెట్రో రైలు ప్రారంభమైన తర్వాత సామాన్య ప్రజలు కూడా ఏసీ కలిగిన మెట్రో రైలులో ప్రయాణించవచ్చని మెట్రో రైలు అధికారులు తెలిపారు. మెట్రో రైలు సేవలు ప్రారంభించిన తర్వాత ట్రాఫిక్ ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయని అధికారులు చెప్పారు.