రేపే కోటప్పకొండలో సిఎం చంద్రబాబు పర్యటన...రోప్ వే ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన
గుంటూరు: పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా వెలుగొందుతున్న గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రి కోటేశ్వరుని దేవస్థానంకు మరో ఆకర్షణ సమకూరనుంది. ప్రపంచంలో అరుదుగా కనిపించే రోప్ వే ప్రాజెక్ట్ కోటప్పకొండలో అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం గుంటూరు జిల్లా కోటప్పకొండలో పర్యటన సందర్భంగా ఈ రోప్వే ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేయనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుఉదయం 10గంటలకు కోటప్పకొండకు చేరుకొని ముందుగా రోప్ వే ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేస్తారు. అనంతరం ఆ తరువాత ఎకో టూరిజం పార్క్, శివలింగం ఆలయాన్ని చంద్రబాబు సందర్శిస్తారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3గంటలకు బెంగళూరు బయలుదేరివెళతారు. అక్కడ హడిల్-2018 కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు ప్రసంగిస్తారు.
ఈనెల 17న కోటప్పకొండలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొండ దిగువన సోపాన మార్గం పక్కన రోప్వే నిర్మాణాన్ని పర్యాటక శాఖ చేపట్టనున్నది. ఈ పనులకు శనివారం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఇక్కడి పర్యాటక కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం శ్రీ త్రికోటేశ్వర స్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దర్శించుకుంటారు. సిఎం పర్యటన ఏర్పాట్లను ఇప్పటికే పర్యాటక శాఖ కమిషనర్ హిమాన్షు శుక్లాతో కలసి రోప్వే నిర్మాణ పనుల ప్రదేశాన్నిపరిశీలించడం, శంకుస్థాపన ఏర్పాట్లను పర్యవేక్షించడం చేశారు.