ముఖ్యమంత్రికి 79వ ర్యాంక్: విలువ లేదని చెప్పిన బాబు, కలకలం
విజయవాడ: తెలుగుదేశం పార్టీలో 'ర్యాంకుల' కలకలం చెలరేగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరు పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్వే చేయించారు. సర్వే ఆధారంగా సోమవారం కేబినెట్ సమావేశంలో ర్యాంకులు ప్రకటించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ర్యాంకుల్లో మంత్రులు పీతల సుజాత మొదటి స్థానంలో, పీ నారాయణ చివరి స్థానంలో ఉన్నారు. ఎమ్మెల్యేల్లో వేగుళ్ల జోగేశ్వర రావు, కలవలపూడి శివ, గద్దె రామ్మోహన్ రావులు తొలి మూడు స్థానాల్లో, ముఖ్యమంత్రి చంద్రబాబు 79వ స్థానంలో నిలిచారు.
ఈ జాబితాలో వివరాల విశ్వసనీయత పైన చర్చ జరుగుతుండగానే.. చంద్రబాబు అసలు విషయం బయట పెట్టినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ర్యాంకులు అసమగ్రమని, దీనికి ఎలాంటి విలువ లేదని ఆయన చెప్పారని తెలుస్తోంది.
పది అంశాల ప్రాతిపదికన మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేసి ర్యాంకులు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశిస్తే, కేవలం వారు చేసిన పర్యటనలు, నిర్వహించిన మీడియా సమావేశాల ఆధారంగా హడావిడిగా ర్యాంకులు ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించని చంద్రబాబు.. వారికి ర్యాంకులు ఇచ్చారని తెలుస్తోంది. అసలు విషయం తెలిశాక.. వాటికి విలువ లేదని చెప్పారని తెలుస్తోంది.
పది అంశాల పైన మదింపు చేయాలంటే రెండు అంశాలనే ఎందుకు తీసుకున్నారని, అంత హడావుడి ఎందుకు అని పార్టీ సీనియర్ల పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
అనధికారికంగా విడుదలైన ర్యాంకింగ్ జాబితాలో ఇద్దరు బిజెపి మంత్రుల పేర్లు కూడా వచ్చాయి. టిడిపి కోసం పని చేసిన వారిలో బిజెపి నేతల పేర్లు ఎలా వచ్చాయని ప్రశ్న తలెత్తుతోందని అంటున్నారు. మరోవైపు, మంత్రి నారాయణకు చివరి స్థానం (18వ స్థానం) రాగా, అతను మాత్రం తనకు ఆరో స్థానం లభించిందని చెప్పారు.
జాబితా ప్రకారం మంత్రుల ర్యాంకులు ఇవి.. 1. పీతల సుజాత, 2. దేవినేని ఉమామహేశ్వర రావు, 3. పత్తిపాటి పుల్లారావు, 4. చినరాజప్ప, 5. కొల్లు రవీంద్ర, 6. రావెల కిషోర్ బాబు, 7. అచ్చెన్నాయుడు, 8. పరిటాల సునీత, 9. గంటా శ్రీనివాస రావు, 10. బొజ్జల గొపాలకృష్ణా రెడ్డి, 11. శిద్దా రాఘవ రావు, 12. పల్లె రఘునాథ్ రెడ్డి, 13. మృణాళిని, 14. కామినేని శ్రీనివాస్, 15. యనమల రామకృష్ణుడు, 16 మాణిక్యాల రావు, 17. కెఈ కృష్ణమూర్తి, 18. అయ్యన్న పాత్రుడు, 19. నారాయణ. అయితే, ఈ జాబితా అనధికారికం కాబట్టి... ఒకేలా కనిపించడం లేదు.
నారాయణకు 18వ ర్యాంక్ అని కొందరు, 19వ ర్యాంక్ అని మరికొందరు అంటే.. నారాయణ మాత్రం తనది ఆరో ర్యాంక్ అని చెబుతున్నారు. పరిటాల సునీతకు 5వ స్థానం అని కొందరు, 8వ స్థానం అని మరికొందరు చెబుతున్నారు. అయ్యన్నపాత్రుడుకు 10వ స్థానం అని కొందరు, 18వ స్థానం అని మరికొందరు చెబుతున్నారు. ర్యాంకుల విషయంలోను స్పష్టత లేదు.
కాగా, మంత్రుల పని తీరుపై నిన్న ప్రకటించిన ర్యాంకులు అవాస్తవం, అవి సీఎం ప్రకటించిన ర్యాంకులు కాదని మంత్రి నారాయణ అన్నారు. ఆ సర్వేలు ఏ ప్రాతిపదికన, ఎవరు తయారుచేశారో తనకు తెలియదన్నారు. వాస్తవంగా చిత్తూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా తనకు మంచి ర్యాంకు వచ్చిందన్నారు.