సీఎం రమేష్, కె.రవీంద్రకుమార్కు రాజ్యసభ చాన్స్, వర్ల రామయ్యకు దక్కని చోటు
అమరావతి:రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం రమేష్ కు మరోసారి రాజ్యసభ అభ్యర్ధిత్వాన్ని పొడిగించాలని నిర్ణయించారు. వర్ల రామయ్య స్థానంలో టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కనకమేడల రవీంద్రకుమార్ పేరును ఖరారు చేశారు. అయితే అభ్యర్ధుల ఎంపికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సీఎం రమేష్ పదవిని పొడిగించాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. రాజ్యసభకు తమ పేర్లను పరిశీలించాలని కొందరు ఆశావాహులు చంద్రబాబునాయుడును కోరారు. కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావు పేరును రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం పరిశీలించారు.
కానీ, చివరి నిమిషంలో విరమించుకొన్నారు.అయితే సీఎం రమేష్, వర్ల రామయ్య పేర్లను ఖరారు చేశారని ప్రచారం సాగింది. అధికారికంగా ప్రకటించడమే తరువాయిగా నిర్ణయించారు. కానీ చివరి నిమిషంలో పేర్లు మారిపోయాయి.చివరి వరకు రేసులో ఉన్న వర్ల రామయ్యకు ఛాన్స్ దక్కలేదు. వర్ల రామయ్య స్థానంలో కనకమేడల రవీంద్రకుమార్ కు స్థానం దక్కింది.
వచ్చే ఎన్నికల్లో కావలి నుండి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకోవాలని చంద్రబాబునాయుడు బీద మస్తాన్ రావుకు సూచించారు. దీంతో మస్తాన్రావు రాజ్యసభ రేసు నుండి వెనక్కి తగ్గారు. మసాల పద్మజతో పాటు మరికొందరు కూడ రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం బాబు వద్ద లాబీయింగ్ చేశారు.
ఆదివారం మధ్యాహ్నం చంద్రబాబునాయుడు పార్టీ నేతలు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడుతో చర్చించారు.సుదీర్ఘంగా ఈ చర్చ సాగింది. కానీ, అభ్యర్ధుల పేర్లను మాత్రం ప్రకటించలేదు.
అయితే రాజకీయసమీకరణాల్లో మార్పులు చోటు చేసుకొన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.ఈ పరిస్థితుల నేపథ్యంలో కనకమేడల రవీంద్రకముార్ పేరును రాజ్యసభ అభ్యర్ధిగా నిర్ణయించారు.
అయితే ఈ పేర్లను పార్టీ నాయకత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓసీ, ఎస్సీలకు టిక్కెట్లను కేటాయించాలని భావించారు. కానీ, చివరి నిమిషంలో రెండు స్థానాలకు ఓసీలకే కేటాయించాలని బాబు నిర్ణయం తీసుకొన్నారు.