ఆరో రోజుకు సీఎం రమేష్, బీటెక్ రవి దీక్ష: క్షీణించిన ఇరువురి నేతల ఆరోగ్యం
Recommended Video
కడప:కడప స్టీలు ప్లాంటు కోసం ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి చేపట్టిన ఆమరణ దీక్ష ఆరవ రోజుకు చేరుకుంది. అయితే గత ఆరు దినాలుగా దీక్ష చేస్తుండటంతో సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. షుగర్ లెవల్స్ క్రమంగా పడిపోతున్నాయి.
అయితే ఆరోగ్యం క్షీణించినప్పటికీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయ్యే వరకు తమ దీక్షను మాత్రం ఆపేదే లేదని ఈ ఇరువురు నేతలు స్పష్టం చేశారు. ఆదివారం వీరిని పరీక్షించిన వైద్యులు రమేశ్, రవి ఇద్దరూ బరువు తగ్గారని...చాలా నీరసంగా ఉన్నారని...షుగర్ లెవల్స్, బీపీ పడిపోయాయని తెలిపారు. మరోవైపు దీక్షతో వీరి ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఆరోరోజుకు దీక్ష...సంఘీభావం
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేస్తున్న నిరాహార దీక్ష సోమవారంకు ఆరో రోజుకు చేరుకుంది. ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి దీక్షకు సంఘీభావం ప్రకటించారు.
మంత్రులు చిన్నరాజప్ప, గంటా శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాసులు, పత్తిపాటి పుల్లారావు, ఆదినారాయణరెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, విప్ రామసుబ్బారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పుత్తా సుధాకర్యాదవ్, దర్శకేంద్రుడు రాఘవేందర్రావు, నాయకులు హరిప్రసాద్, దుర్గాప్రసాద్, జిలానీబాషా తదితరులు బైఠాయించారు. ఎంపీ టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి సంఘీభావం తెలిపినవారిలో ఉన్నారు.
ఆపేదీ లేదు...పోరాటమే
ఈ సందర్భంగా హో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం సహకరించకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాడుతూనే ఉన్నారని, కడపలో ఉక్కు కోసం అన్ని వసతులున్నా కేంద్రం మాత్రం పట్టించుకోకుండా అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, హామీల అమలు కోసం త్వరలో విశాఖ, కాకినాడలో కూడా ఉద్యమాలు చేపట్టనున్నామని వెల్లడించారు. కేంద్రం దిగివచ్చే వరకు ఉద్యమాలను ఆపేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. వెనుకబడిన కడప జిల్లాకు ఉక్కు ఎంతో అవసరమని, అందుకోసం సీఎం.రమేష్, రవి చేస్తున్న దీక్షలకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చి మద్దతు ఇస్తున్నారని అన్నారు.
ఖచ్చితంగా...కడప ఉక్కు
పౌర సరఫరాలశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. కలియుగ సైంధవులుగా పేరొందిన జగన్, పవన్ అభివృద్ధి నిరోధకులుగా మారారని దుయ్యబట్టారు. జగన్ కోసమో, గాలి జనార్ధన్రెడ్డి కోసమే తెలియదు కానీ కేంద్రం మాత్రం ఉక్కు పరిశ్రమ ఇవ్వడం లేదన్నారు. కేసుల మాఫీ కోసం, డబ్బులు దాచుకునేందుకు కడప పౌరుషాన్ని మోడీ వద్ద తాకట్టుపెట్టారన్నారు. వైఎస్సార్ జిల్లాని పేరు పిలిచేందుకు కూడా జగన్ అర్హుడుకాడన్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్టీ రామారావును పదవి నుంచి దించితే చంద్రబాబు నాయుడు ప్రధానికి దిమ్మదిరిగేలా జవాబు ఇచ్చి మళ్లీ ఎన్టీఆర్ను ముఖ్యమంత్రిగా నిలబెట్టిన ఘనత చంద్రబాబుదని ఆయనకు అపజయం లేనేలేదని మంత్రి పుల్లారావు స్పష్టం చేశారు. అదే కోవలో ప్రస్తుతం ఎంపీ రమేష్ చేస్తున్న పోరాటాలకు కూడా అపజయం లేదని ఆయన ఖచ్చితంగా కడప ఉక్కు సాధిస్తారన్నారు.
త్యాగం చేసేవారు...కొందరే
గృహనిర్మాణశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. కడపలో ఉక్కు నిర్మాణం కోసం ఎంపీ రమేష్, ఎమ్మెల్సీ రమేష్ చిత్తశుద్ధితో చేస్తున్న దీక్షలు విజయవంతం అవుతాయని పేర్కొన్నారు. 48 గంటలపాటు దీక్షలు చేసిన వైకాపా ఎమ్మెల్యేలు ఆ మాత్రానికే నీరుగారిపోయారని, కానీ ఒక నిశ్చలమైన దక్షతతో వీరిద్దరు చేస్తున్న దీక్షకు తప్పక కేంద్రం దిగివస్తుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న జగన్ నాలుగేళ్లుగా కేంద్రంపై ఎందుకు పోరాడలేకపోతున్నారని కనీసం పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు. ఉప ఎన్నికల సమయంలో కడపకు దిల్లీకి పోటీ అని చెప్పి సోనియాను ప్రశ్నించిన జగన్ ఇప్పుడు దిల్లీకి కడపను తాకట్టు పెట్తున్నారని దుయ్యబట్టారు. దేశం కోసం, ప్రజల కోసం త్యాగం చేసేవారు కొందరే పుడతారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు.