అగస్టా స్కాంలోకి జగన్ బావ అనిల్ని లాగిన సీఎం రమేష్, దేవినేనికి హరీష్ ఫోన్
న్యూఢిల్లీ: ఆగస్టా చాపర్ కుంభకోణంలో హష్కీతో బ్రదర్ అనిల్ కుమార్కు సంబంధాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై ఖమ్మం జిల్లాలో ఆయన పైన కేసు నమోదయిందని వ్యాఖ్యానించారు.
ఈ విషయమై 2012లోనే రాజ్యసభలో తాను ప్రస్తావించానని చెప్పారు. నాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదన్నారు. సీబీఐతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తే నిజాలు బయటపడతాయన్నారు. కాగా, అగస్టా వెస్ట్ ల్యాండ్ చాపర్ డీలర్ పైన రక్షణ మంత్రి పారికర్ పార్లమెంట్లో ఒక ప్రకటన చేయనున్నారు.
బిజెపితో కలిసి హోదా సాధిస్తాం: సుజనా
భారతీయ జనతా పార్టీతో కలిసి తాము ప్రత్యేక హోదాను సాధిస్తామని కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి చెప్పారు. తాము మిత్రపక్షంగా బీజేపీని గౌరవిస్తామని చెప్పారు. ఏపీ సమస్యల విషయంలో ఒక్కో ఎంపీకి ఒక్కో అంశాన్ని కేటాయించి ఫలితం సాధిస్తామని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మరో ఎంపీ రాయపాటి సాంబశివ రావు డిమాండ్ చేశారు. ఆయన ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని మన్మోహన్ సింగ్, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ చెప్పారని గుర్తు చేశారు.
ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయన్నారు.
హరీష్ రావుకు దేవినేని ఫోన్
తాము తెలంగాణ ప్రాజెక్టుల పైన కేంద్రానికి ఫిర్యాదు చేశామని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. సీడబ్ల్యూసీ అనుమతితోనే ప్రాజెక్టులు చేపట్టాలన్నారు.
కాగా, ఏపీ మంత్రి దేవినేని ఉమకు తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫోన్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రాజెక్టుల వివాదాన్ని పరిష్కరించుకుందామని చెప్పినట్లుగా తెలుస్తోంది.
విభజన చట్టానికి కట్టుబడే ప్రాజెక్టులు నిర్మించుకుందామని, కర్నాటక, మహారాష్ట్రపై పోరాటం చేద్దామని హరీష్ రావుతో ఉమ అన్నారని తెలుస్తోంది. కేంద్రమంత్రి ఉమాభారతి సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎంలను కూర్చోబెట్టి సమస్యలను పరిష్కరించుకుందామని దేవినేని చెప్పారని తెలుస్తోంది.