రుజువు చేస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా: పార్లమెంటులో ఊగిపోయిన సీఎం రమేష్, ‘బాబును టార్గెట్ చేసి..’
Recommended Video
న్యూఢిల్లీ: తాను ఇప్పుడు రాజీనామా చేస్తానంటూ.. తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ మంగళవారం పార్లమెంటులో ఆవేశంగా మాట్లాడారు. రాజ్యసభలో కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్ అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన తెలుగులో మాట్లాడారు.
కేంద్ర ఆర్థిక శాఖమంత్రి పీయూష్ గోయల్, మరో మంత్రి ప్రకాశ్ జవదేకర్ గతంలో చెప్పిన విషయాలనే మళ్లీ చెబుతూ విభజనకు ముందు రాష్ట్రంలో విద్యా సంస్థలు లేవన్నట్టుగా మాట్లాడటంపై రమేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
విద్యాసంస్థలకు నిధులేవీ?
‘ప్రకాశ్ జవదేకర్ యూనివర్సిటీల గురించి చెప్పారు. ఇన్స్టిట్యూట్లన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయన్నారు. రాష్ట్రం కొత్తది, అక్కడ విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలంటే ఏపీ ప్రభుత్వం రూ.12 కోట్ల విలువైన స్థలం ఇచ్చింది. విద్యా సంస్థల ఏర్పాటుకు రూ.14వేల కోట్లు ఖర్చవుతుంది. ఇప్పటివరకు 8-9 సంస్థలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం కేవలం రూ.546 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇలా కేంద్రం వ్యవహరిస్తే ఏపీ విద్యార్థులు ఎక్కడికి వెళ్లి చదువుకోవాలి?' అని సీఎం రమేష్ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతేగాక, నాలుగేళ్లు అయినా విద్యాసంస్థల్లో మౌలికవసతులు లేవని అన్నారు.
ఏపీలో ఓట్లు, సీట్లు లేవనే..
‘నాలుగేళ్లు ఓపిగ్గా ఉన్నాం. భాగస్వామ్యంతో నడుస్తున్న ప్రభుత్వమే కదా.. చేస్తారని అనుకున్నాం. అనేకసార్లు ఎంతగా వేడుకున్నాం. సీఎం చంద్రబాబు హామీల అమలు కోసం ఢిల్లీ చుట్టూ తిరిగారు. అయినా స్పందనలేదు. రాష్ట్రంలో బీజేపీకి రాష్ట్రంలో ఓట్లు, సీట్లు లేవు గనకే ఇలా వ్యవహరిస్తోంది' అని సీఎం రమేష్ ధ్వజమెత్తారు.
టీడీపీని దెబ్బకొట్టాలని..
‘దేశంలో ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఏమీ చేయకపోయినా అన్నీ చేశామని చెబుతోంది. టీడీపీని రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తోంది. కొత్త ఆర్థిక మంత్రి కొత్త సినిమా చూపిస్తున్నారు. ఆ రోజు సభలో ఏం జరిగిందో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ స్పష్టంగా చెప్పారు. బీజేపీలో నేతలు కూడా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగారు' అని సీఎం రమేష్ గుర్తు చేశారు.
ఇప్పుడే రాజీనామా చేస్తానంటూ రమేష్..
‘ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని రుజువు చేస్తే నేను ఇప్పుడే పదవికి రాజీనామా చేసి పోతా. ఎక్కడ చెప్పారో చూపించమనండి. టీడీపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికీ ఇకపై ప్రత్యేక హోదా ఇవ్వబోమని, దానికి సమానమైన ప్రయోజనాలు చేకూరుస్తామని అన్నారు గనకే ఆనాడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాం. ఇప్పటికి రెండేళ్లు గడిచినా ఒక్క పైసా కూడా మాకు రాలేదు. మా సీఎం చంద్రబాబు 29 సార్లు ఢిల్లీకి వెళ్లి కాళ్లరిగేలా తిరిగితే ఒక్కపైసా కూడా విదల్చకుండా ఇప్పుడు యూటర్న్ తీసుకున్నామంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టం. ఏపీ ప్రజలంటే ఎందుకింత నిర్లక్ష్యం? తమ భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ పాలిస్తున్న ఏపీకి ప్రధాని ఒక్కసారి వస్తే.. అమెరికాకు నాలుగేసార్లు పోతారా? బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు ఎన్నిసార్లు వెళ్లారు?' అని రమేష్ ప్రశ్నించారు.
బాబంటే భయం.. అందుకే టార్గెట్ చేశారు
‘భయంతోనే చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. వాజపేయిని, దేవెగౌడను ప్రధానిని చేసింది చంద్రబాబే. ప్రాంతీయ పార్టీలను కూడగడుతున్నారనే చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబుతో ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోండి. అంతేగానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఇలా వ్యవహరించడం సరికాదు. తిరుపతికి వచ్చి ప్రధాని చెప్పినప్పుడు ఆయనకు హోదా గురించి తెలీదా? న్యాయం జరిగే వరకూ మేం వదిలే ప్రసక్తే లేదు' అని సీఎం రమేశ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.