చంపేసి సంతాప సభా?: కాంగ్రెస్ది కుటిల నీతంటూ బయటపెట్టిన సీఎం రమేష్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరు చంపేసి సంతాప సభ పెట్టినట్లు ఉందని తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం ఉదయం ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ.. ప్రైవేటు బిల్లుతో ప్రయోజనం ఉండదన్నారు.
పార్లమెంటులో ఇంతవరకు ప్రైవేటు బిల్లు ఆమోదం పొందలేని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా కోసం సభను స్తంభింపజేయాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం ఉందని, అందుకు తెలుగుదేశం పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం రమేష్ అన్నారు.
అంతేగాక, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరు సాగిస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని సీఎం రమేశ్ ఆరోపించారు. ఏపీకి హోదా కోసం కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన బిల్లు నేడు రాజ్యసభలో ఓటింగ్కు రానున్న నేపథ్యంలో మాట్లాడిన రమేశ్... ఓ సరికొత్త వాదనను వినిపించారు. పార్లమెంటు సభా వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశంలో భాగంగా జరిగిన చర్చను ఆయన బయటపెట్టారు.
నేడు రాజ్యసభ ముందుకు రానున్న ప్రైవేటు బిల్లుల్లో కేవీపీ బిల్లు తొలి స్థానంలోనే ఉండగా, బీఏసీ సమావేశంలో దానిని 13వ స్థానానికి మార్చారని రమేశ్ చెప్పారు. ఈ సందర్భంగా బీఏసీ సమావేశంలోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దీనికి ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఆయన మండిపడ్డారు.
కేవీపీ బిల్లు ఓటింగ్ కు రాకూడదన్న భావనతో బీజేపీ బిల్లును ఒకటో స్థానం నుంచి 13 వ స్థానానికి మార్చితే... దానిని గమనించినా కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేదని చెప్పారు. వెరసి కేవీపీ బిల్లు ఓటింగ్ కు రావడం కాంగ్రెస్ పార్టీకి కూడా ఇష్టం లేదనే భావించాల్సి ఉందని సీఎం రమేశ్ చెప్పుకొచ్చారు.
మా మద్దతు ఉంటుంది: వైవీ సుబ్బారెడ్డి
ప్రత్యేక హోదా కోసం రెండేళ్లుగా పోరాటం చేస్తుంది ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. హోదా కోసం ఏ పార్టీ పోరాటం చేసినా తమ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా కోసం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. లోకసభలో కూడా ప్రైవేటు బిల్లు పెట్టేందుకు యత్నిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.
ప్రత్యేక హోదా విషయంలో ఎన్టీఏను తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎందుకు నిలదీయడం లేదని కాంగ్రెస్ పార్టీ నేత మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఏపీ ప్రజల కోసం రాజకీయాలను పక్కన పెట్టాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెడుతున్న ప్రైవేటు బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం అన్నారు.