వైసిపి నేతని మారుస్తారు: జగన్పై సిఎం, 'శోభ'తో భూమకి రోజా కౌంటర్
చిత్తూరు/కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ నేతను మార్చుకునే యోచనలో ఉన్నారని టిడిపి సీనియర్ నేత, ఎంపీ సిఎం రమేష్ మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తీరు పైన ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లోనే తీవ్ర అసంతృప్తి ఉందన్నారు.
వైసిపి ఎమ్మెల్యేలు ఎప్పుడైనా తమ నాయకుడిని మార్చుకోవచ్చునని వ్యాఖ్యానించారు. అభివృద్ధికి అడ్డుపడితే ఎమ్మెల్యేలు జగన్తో ఉండలేరన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింటుమెంట్ లేకున్నప్పటికీ జగన్ ఎందుకు ఢిల్లీ వెళ్లారో చెప్పాలన్నారు. జగన్తో ఎమ్మెల్యేలు వేగలేకపోతున్నారన్నారు.
శోభా నాగిరెడ్డి ఆత్మక్షోభిస్తుంది: రోజా
ఇప్పుడు శోభా నాగిరెడ్డి ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీలో చేరేవారన్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వ్యాఖ్యలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నటి రోజా మంగళవారం నాడు కౌంటర్ ఇచ్చారు. భూమా, ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ సోమవారం సైకిల్ ఎక్కిన విషయం తెలిసిందే.
దీనిపై రోజా మంగళవారం ఘాటుగా స్పందించారు. భూమా తెలుగుదేశం పార్టీ చేరడం వల్ల పైలోకంలో ఉన్న ఆయన భార్య శోభానాగి రెడ్డి ఆత్మ క్షోభిస్తుందన్నారు. శోభ చనిపోయాక ఏపీ శాసనసభలో ప్రభుత్వం కనీసం సంతాపం కూడా ప్రకటించలేదన్నారు.
ఇప్పుడు అదే టిడిపిలోకి ఆమె కుటుంబ సభ్యులు వెళ్లడం దారుణమని అభిప్రాయపడ్డారు. వైసిపి నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి గెలవాలని రోజా డిమాండ్ చేశారు. ఎంతమంది చేరితే అంత తొందరగా టిడిపి మునిగిపోతుందన్నారు.
తెలంగాణలో చంద్రబాబు పైన నమ్మకం లేకపోవడం వల్లే ఆ పార్టీ నేతలు అక్కడి అధికార తెరాసలోకి వెళ్తున్నారన్నారు. ఏపీలో వీరికి ఎలా చంద్రబాబుపై నమ్మకం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, టిడిపి నేతలు మైండ్గేమ్ ఆడుతున్నారన్నారు.
చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ అవినీతిలో డబుల్ డిజిట్ సాధించారని ఎద్దేవా చేశారు. సొంతపార్టీ పెట్టి చంద్రబాబు ఒక్క సీటైనా గెలవగలరా అని నిలదీశారు. నలుగురు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రన బెదిరేది లేదన్నారు. చంద్రబాబు నిప్పుకాదని, రాజకీయాలకు పట్టిన తుప్పు అన్నారు.
ఏదో ప్రయోజనం ఆశించి వెళ్లి ఉంటారన్నారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. అభివృద్ధి పనుల పేరుతో చంద్రబాబు, లోకేష్ వేల కోట్లు సంపాదించారని తీవ్ర ఆరోపణలు చేశారు. సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లగలరా అని ప్రశ్నించారు.
స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ వీడుతున్నారు: శ్రీనివాసులు
కొందరు ఎమ్మెల్యే స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడుతున్నారని వైసిపి ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. వైసిపి ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మేం జగన్ వెంటే: ఎమ్మెల్యేలు చాంద్ పాషా, ఐజయ్య
తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని ఎమ్మెల్యే ఐజయ్య చెప్పారు. తాను టిడిపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పారు. తాను పార్టీ మారడం లేదని కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా అన్నారు. తాను ఎప్పుడూ జగన్ వెంటే ఉంటానని చెప్పారు.