లేదంటే ఆమరణదీక్షకు దిగుతా: ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రమేష్ లేఖ
కడప: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్రమంత్రి చౌదరి బీరేంద్ర సింగ్కు టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ సోమవారం కడప స్టీల్ ప్లాంట్ అంశంపై లేఖ రాశారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు.
Recommended Video
ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి మెకాన్ సంస్థ ఇచ్చిన సాధ్యాసాధ్యాల నివేదిక పరిశీలించాలని కోరారు. ప్లాంట్ ఏర్పాటు కోసం వెంటనే చర్యలు చేపట్టాలని, లేదంటే ఆమరణ దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు.
కడప జిల్లాతో పాటు తెలంగాణలోని బయ్యారంలో స్టీల్ ప్లాంటులను ఏర్పాటు చేయడం సాధ్యపడదని పేర్కొంటూ ఓ నివేదికతో కూడిన అఫిడవిట్ను ఇటీవల కేంద్రం సుప్రీం కోర్టుకు అందించింది. దీనిపై తెలుగు రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో సీఎం రమేష్ కడప స్టీల్ ప్లాంట్ ప్రజల హక్కు అని, దానిని సాధించడం కోసం నిరాహారదీక్షకు దిగుతానని చెప్పారు. ఈ క్రమంలో ఇప్పుడు లేఖ రాశారు.
చంద్రబాబు ఢిల్లీలో పిల్లి: సీ రామచంద్రయ్య
ఏపీ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ నేత సీ రామచంద్రయ్య నిప్పులు చెరిగారు. నాలుగేళ్లుగా కడప స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకోని టీడీపీ నేతలు ఇప్పుడు దొంగ దీక్షలకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పులి, ఢిల్లీలో పిల్లిలా వ్యవహరిస్తున్నారన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రో ధరలు ఎక్కువ అన్నారు. చంద్రబాబు పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి పోయిందని ధ్వజమెత్తారు.