మైసూరాతో సీఎం రమేష్ భేటీ: పార్టీ మారబోతున్నారా!; తిరుపతిలో భూమన అరెస్టు
టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఆదివారం సాయంత్రం ఎర్రగుంట్లలో మాజీ రాజ్య సభ్యులు మైసూరా రెడ్డితో భేటీ అయ్యారు.
కడప : గత కొన్నాళ్లుగా.. ఏపీలో అధికార పక్షం ఆపరేషన్ ఆకర్ష్ కు తెరపడినట్టుగానే కనిపిస్తున్నా.. వైసీపీ పట్ల అసంతృప్తితో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న మైసూరా రెడ్డి లాంటి నేతలపై టీడీపీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది.
వైసీపీకి దూరమైన తర్వాత.. మరే రాజకీయ పార్టీతోను సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. టీడీపీలో చేరబోతున్నారంటూ ఆమధ్య వార్తలు వచ్చినా.. అవేవి వాస్తవరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ మైసూరాతో భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆదివారం సాయంత్రం ఎర్రగుంట్లలో మైసూరాను కలిశారు సీఎం రమేష్. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మైసూరాతో సీఎం రమేష్ భేటీ ఆసక్తికరంగా మారింది. టీడీపీలోకి ఆహ్వానించడానికే సీఎం రమేశ్ మైసూరాను కలిశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జగన్ కంచుకోట అయిన కడపలో టీడీపీ చాలా వెనకబడి ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కడపను పార్టీ రాజకీయాలకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్న టీడీపీ.. మైసూరా లాంటి నేతలను పార్టీలో చేర్చుకోవడం ఇందుకు కలిసి వస్తుందని భావిస్తుంది.
నోట్ల రద్దుపై ఆందోళనకు దిగినందుకు భూమన అరెస్టు :
దేశంలో పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ.. ప్రతిపక్ష పార్టీలు సోమవారం నాడు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో నోట్ల రద్దుకు వ్యతిరేకంగా తిరుపతిలో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. పెద్ద నోట్ల రద్దు సామాన్యులను తీవ్రంగా వేధిస్తోందని, బ్యాంకులు, ఏటీఎంల్లో సరిపడనంత డబ్బు ఉంచాలని ఈ సందర్బంగా ఆయన డిమాండ్ చేశఆరు.
కాగా, వైసీపీ నేతలంతా రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకోవడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆయన్ను పోలీసు వాహనంలో స్టేషన్ కు తరలిస్తుండగా.. వైసీపీ శ్రేణులు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ప్రస్తుతం స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.