కేవీపీకి మద్దతుపై సీఎం రమేష్ దాటవేత, హోదాకు ఓయూ విద్యార్థి మద్దతు
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే దానిని సాధిస్తామని రాజ్యసభ టిడిపి ఎంపీ సీఎం రమేష్ బుధవారం నాడు పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ పార్టీని నమ్మడానికి ఏమాత్రం వీల్లేదన్నారు.
చంద్రబాబు నాయకత్వంలో హోదా సాధిస్తామన్నారు. ప్రత్యేక హోదా సాధనకు తమ ప్రయత్నాలు కోనసాగుతాయన్నారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు పెట్టిన ప్రయివేటు బిల్లుపై మద్దతు ప్రశ్నకు సీఎం రమేష్ సమాధానాన్ని దాటవేశారు.
చలసాని దీక్ష విరమణ
ప్రత్యేక హోదా డిమాండుతో దీక్ష చేపట్టిన ఆంధ్రా మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్ బుధవారం నాడు దీక్షను విరమించారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, వైసిపి నేత శివరామి రెడ్డి, కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు.
అనంతపురంలో దీక్ష చేపట్టిన చలసానిని ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాదులోని ఆసుపత్రికి తరలించారు. ఆయన దీక్షను కొనసాగించారు. బుధవారం నాడు విరమించారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస్ మాట్లాడారు.
ఈ నెల 18న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తన దీక్షకు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు తెలిపిన సంఘీభావం సంతోషకరమన్నారు. కేంద్రం విభజన హామీలు అమలు చేయాల్సిందేనని, అప్పటి వరకు తాను పోరాడుతూనే ఉంటానని చెప్పారు.