ఇంకా అబద్దాలొద్దు, ఇదిగో లెక్క: రిజల్ట్స్పై జగన్కి సిఎం
హైదరాబాద్: ఎన్నికల ఫలితాల పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తప్పుడు లెక్కలు చెబుతోందని తెలుగుదేశం పార్టీ నేత సిఎం రమేష్ గురువారం మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటికైనా అబద్దాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. సీమాంధ్రలో స్థానిక ఎన్నికలలో తమకు 45 శాతం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 28 శాతం, కాంగ్రెసు పార్టీకి 5 శాతం ఓట్లు వచ్చాయన్నారు. స్థానిక ఎన్నికల తర్వాత తమ పార్టీ మరింత పుంజుకుందని, అది సార్వత్రిక ఎన్నికలలో కలిసి వస్తుందన్నారు.
ఓ పార్టీలో ఉన్నప్పుడు నాయకుడు చెప్పినట్లు చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మైసూరా రెడ్డి గతంలో చెప్పారని, ఆయన తన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని, కానీ సొంత క్యాడర్ను కూడా తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. అబద్దాలు చెప్పడం ఆ పార్టీ మానుకోవాలన్నారు.
ఇదీ లెక్క
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు చూస్తే.. వెయ్యి నుండి ఐదువేల ఓట్ల మెజార్టీతో టిడిపి 42, వైయస్సార్ కాంగ్రెస్ 14, ఐదువేల నుండి నుండి పదివేల ఓట్ల మెజార్టీతో టిడిపి 28, వైయస్సార్ కాంగ్రెస్ 11, పదివేల నుండి నుండి పదిహేను వేల ఓట్ల మెజార్టీతో టిడిపి 14, వైయస్సార్ కాంగ్రెస్ 4, పదిహేను వేల నుండి నుండి ఇరవై వేల ఓట్ల మెజార్టీతో టిడిపి 18, వైయస్సార్ కాంగ్రెస్ 6, ఇరవై వేలకు పైగా ఓట్ల మెజార్టీతో టిడిపి 19, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరింట గెలుపొందిందని రమేష్ చెప్పారు. ఈ లెక్కలు ఎవరికి అనుకూలమో చెప్పాలన్నారు.
ఫలితాలకు మరో పన్నెండు, పదమూడు గంటలు మాత్రమే ఉన్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అబద్దాలు చెప్పవద్దన్నారు. ఆ పార్టీ ఆత్మవంచన చేసుకోవాలన్నారు. చంద్రబాబు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని, అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్మారన్నారు. బాబు ప్రకటించిన రైతు రుణమాఫీని నమ్మారన్నారు. ఇటీవల వెలువడిన ఫలితాలను కూడా తప్పుగా చెబుతున్నారని, తప్పుడు లెక్కలతో ప్రజల తీర్పును తప్పుగా చూపలేరన్నారు.
సార్వత్రిక ఎన్నికలలో తాము కచ్చితంగా 125 స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలలో 121 సీట్లలో తమకు స్పష్టమైన మెజార్టీ ఉంటుందని, 12 స్థానాల్లో హోరాహోరీ ఉంటుందని చెప్పారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత టిడిపి పుంజుకుందని చెప్పారు.