రాజధాని మార్పుకు బీజేపీ వ్యతిరేకం: కేంద్రం సూచనలే చేస్తుంది: సుజనా అలా..సీఎం రమేష్ ఇలా..!
ఏపీ మూడు రాజధానుల వ్యవహారం పైన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. రాజధాని తరలింపు అంశాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేసారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదని..సూచనలు మాత్రమే చేస్తుందని తేల్చి చెప్పారు. బీజేపీకి చెందిన మరో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇప్పటికే అమరావతి అంగుళం మార్చినా ఊరుకొనేది లేదని ..తాను కేంద్రంతో మాట్లాడిన తరువాతనే చెబుతున్నానని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో కేంద్రానికి ఈ విషయంలో ఉన్న హక్కులు ఏంటో సరైన సమయంలో చెబుతానని చెప్పుకొచ్చారు. బీజేపీ ఏపీ నేత లు అమరావతి తరలింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆ ప్రాంత రైతులు..స్థానికుల ఆందోళనల్లో పాల్గొన్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సైతం అమరావతి తరలింపుకు బీజేపీ వ్యతిరేమని స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు సుజనా చౌదరి వ్యాఖ్యల తరువాత సీఎం రమేష్ కేంద్రం జోక్యం చేసుకోదంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
బీజేపీ వ్యతిరేకిస్తుంది...
అమరావతి నుండి రాజధాని తరలింపు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని కొద్ది కాలం క్రితం టీడీపీ నుండి బీజేపీ లో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో అమరావతి తరలింపు నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేసారు. ఇప్పటికే ఏపీకి చెందినబీజేపీ నేతలు అమరావతి రైతులకు మద్దతుగా ఆందోళనల్లో పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కేబినెట్ సమావేశం రోజు ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా మౌన దీక్ష చేసారు. రాజధాని అమరావతిగా కొనసాగించాలనే అంశం మీద ఏర్పడిన పొలిటికల్ జేఏసీలకు బీజేపీ దూరంగా ఉన్నా.. ప్రభుత్వం నుండి చేస్తున్న ఆలోచనలను మాత్రం వ్యతిరేకిస్తోంది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఈ విషయంలో ఏ రకంగా స్పందిస్తునేది అందరూ ఎదురు చూస్తున్న అంశం.
సుజనా అలా..సీఎం రమేష్ ఇలా..
ఇక, ఇదే అంశం మీద బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు. అమరావతి అంగుళం కూడా కదల్చటానికి వీళ్లేదని తేల్చి చెప్పారు. కేంద్రం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేసారు. తాను కేంద్రంతో మాట్లాడిన తరువాతనే ఈ అంశం స్పష్టం చేస్తున్నానని వివరించారు. కేంద్రంకు ఈ అంశంలో ఉన్న హక్కులు ఏంటో సరైన సమయంలో బయట పెడతానని చెప్పుకొచ్చారు.
అయితే, ఇప్పుడు అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బీజేపీ రాజధాని తరలింపుకు వ్యతిరేకమని చెబుతూనే.. కేంద్రం ఈ అంశంలో జోక్యం చేసుకోదని..సూచనలు మాత్రమే చేస్తుందని వ్యాఖ్యానించారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని వివరించారు. దీంతో..ఒకే పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు భిన్నంగా కేంద్రం స్పందించే తీరు మీద వ్యాఖ్యాలు చేసారు. ఈ నేతల వ్యాఖ్యలు ఇప్పుడు అమరావతి ప్రాంత రైతుల తో పాటుగా రాజకీయ పార్టీల్లోనూ చర్చకు కారణమైంది.