జైట్లీని సుజనా కలవలేదు, తప్పుడు ప్రచారం: సిఎం రమేష్
అమరావతి/ ఏలూరు: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలువలేదని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ స్పష్టం చేశారు. అదంతా తప్పుడు ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు.
Recommended Video
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన రమేష్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ తీసుకున్నారు. రెండోసారి తనను రాజ్యసభకు పంపినందుకు ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు చెప్పారు.
పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బిజెపి అడ్డుకుంటోందని ఆయన మీడియాతో అన్నారు. అన్నాడియంకె బిజెపి చెప్పుచేతల్లో నడుస్తోందని అన్నారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్యను వరిష్కరించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు
నాలుగేళ్లు తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనిపించని అవినీత ఇప్పుడే కనిపిస్తోందా అని రమేష్ బిజెపి నాయకులను ప్రశ్నించారు తమ ప్రభుత్వం అవినీతి రహిత సమాజమే ధ్యేయంగా పనిచేస్తోందని అన్నారు. బిజెపి ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
బిజెపి తన గొయ్యి తానే తవ్వుకుంటోందని టిడిపి పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు అన్నారు. ఎపి సమస్యలపై కేంద్రం స్పందించకపోవడం దారుణమని ఆయన అన్నారు. ప్రధాని మోడీ మార్చి 5వ తేదీ నుంచి సభకు రావడం లేదని చెప్పారు.
నిధుల, పోలవరం ప్రాజెక్టు విషయాల్లో కేంద్రం అన్యాయం చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. విభజన తప్పు తెలుసుకుని అవిశ్వాసానికి కాంగ్రెసు మద్దతు ఇస్తోందని మాగంటి బాబు అన్నారు.