'ఇంత ఘోరంగానా, నేను 420 అని జగన్ స్వయంగా చెప్పారు, బ్రాండ్ అంబాసిడర్'
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని 420 అంటూ విమర్శలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, ఎంపీ సీఎం రమేష్ భగ్గుమన్నారు. 420కి బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని నిప్పులు చెరిగారు.
Recommended Video
మోడీ అక్కడే ప్రధాని కాదు, బాబు పిలిచినా జగన్ రాలేదు: రామ్మోహన్ నాయుడు నిప్పులు
జగన్మోహన్ రెడ్డికి 420 గురించి బాగా తెలుసునని ఎద్దేవా చేశారు. 420 అంటే అబద్దాలు చెప్పేవాడు, మోసం చేసేవాడు, అన్యాయం చేసేవాడు అన్నారు. జగన్ 420 అని, అది తాను చెప్పడం లేదని, స్వయంగా జగన్ ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని చెప్పారు.
చంద్రబాబును 420 అంటావా?
రాజకీయాల్లో సీనియర్ నేత అయిన చంద్రబాబును ఉద్దేశించి 420 అని జగన్ అనడం విడ్డూరమన్నారు. బంద్ ఎలా నిర్వహించారని ప్రశ్నించారు. నాడు తుని సంఘటన సమయంలో రైళ్లు తగులబెట్టారని, ఇటీవల ఏపీ ప్రత్యేక హోదా బందులోను అలాంటి పనులు చేయాలని చూశారని మండిపడ్డారు.
ఇంత ఘోరంగా మాట్లాడితే ఎలా?
జగన్ మాట తీరు చూస్తుంటే ఓ ప్రతిపక్ష నేత మాట్లాడినట్లుగా లేదని సీఎం రమేష్ అన్నారు. ఇంత దురహంకారంతో మాట్లాడుతున్నాడేమిటి అని తనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తోందన్నారు. సీఎంను పట్టుకొని ఇంత ఘోరాతిఘోరంగా మాట్లాడితే ఎలా అన్నారు. ఇలా మాట్లాడితే ప్రజలు ఉపేక్షించరన్నారు. అందరం కలిసి పోరాడి, ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకుందామన్నారు.
420కి బ్రాండ్ అంబాసిడర్
ప్రజలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతోందని సీఎం రమేష్ అన్నారు. భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే 420కి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా జగన్ తెలుగుదేశం పార్టీ దీక్షకు మద్దతివ్వాలని కోరుతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి దీక్షకు అందరూ మద్దతు తెలపాలన్నారు.
అప్పుడు కలిసి రాలేదు కానీ ఇప్పుడు దీక్షనా?
హోదా కోసం సీఎం చంద్రబాబు తన పుట్టిన రోజు నాడు నాలుగో నెల 20వ తేదీన చేపట్టే ఒక్కరోజు నిరాహార దీక్ష 420 దీక్ష అని జగన్ విమర్శించారు. హోదా కోసం ఈ నెల 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి చేపట్టిన నిరాహార దీక్షకు కలిసిరాని సీఎం తన పుట్టిన రోజునాడు ఒక్కరోజు దీక్ష చేస్తాననడం విడ్డూరమన్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో యథేచ్ఛగా దోపిడీ జరిగిందని, దీన్ని కాగ్ నివేదిక తేల్చి చెప్పిందన్నారు.
ముడుపుల లెక్క చంద్రబాబు నిర్ణయిస్తారు
మైలవరం నియోజకవర్గానికి సంబంధించి అన్యాయపు రాజుగారి దర్భారులో దేవినేని ఉమ ఒక అవినీతి మంత్రి అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారని జగన్ విమర్శించారు. ముడుపులు ఎంత రావాలన్నది చంద్రబాబు నిర్ణయిస్తే, వాటిని మూట కట్టి వాటాలు పంచుకునే వారిలో దేవినేని ఒకరు అన్నారు. పట్టిసీమతో మొదలై పోలవరం, రాజధాని భూములు, ఇసుక మాఫియా వరకు ఆ రాజు, మంత్రిల దోపిడీ నాలుగేళ్లుగా సాగుతోందన్నారు.
చంద్రబాబు చోద్యం చూస్తున్నారు
చంద్రబాబు నివసిస్తున్న ఇంటికి ఎలాంటి అనుమతి లేదని, ఆ ఇంటి పక్కనే ఇసుక దోచేస్తున్నా చోద్యం చూస్తున్నారని జగన్ మండిపడ్డారు. చివరకు పుష్కరాల పేరుతో రూ.వందల కోట్లు దోచుకున్నారన్నారు. నీళ్లు, మజ్జిగ పొట్లాలనూ వదిలి పెట్టలేదన్నారు. విజయవాడ నుంచి కేవలం 29 కిలో మీటర్ల దూరంలో ఉన్న మైలవరంలో వేసవిలో గుక్కెడు నీళ్లు లేక ప్రజలు యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు.