రేపు రావొద్దు: మోడీతో బాబు భేటీ వాయిదా, ప్యాకేజీ ఎంత కోరుతారు?
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీతో రేపు (గురువారం) జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ వాయిదా పడింది. ఈ నెల 25, 28, 29, 31వ తేదీల్లో వీలైన రోజు చెప్పాలని ముఖ్యమంత్రిని చంద్రబాబును కోరినట్లు ప్రధాని కార్యాలయం కోరినట్లుగా తెలుస్తోంది.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీన (రేపు) చంద్రబాబు సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ కావాల్సి ఉంది. అపాయింటుమెంట్ ఇచ్చారు. అయితే, ఇప్పుడు అది వాయిదా పడింది.
రాజధానిలో నిర్మాణాలకు రూ.4వేల కోట్లు అడగనున్న బాబు
ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని అమరావతిలో భవనాల నిర్మాణం కోసం ఈ ఏడాదికి రూ.4వేల కోట్ల ప్యాకేజీ అడగాలని భావించినట్లుగా తెలుస్తోంది. రేపటి భేటీలో చంద్రబాబు ఈ మొత్తం అడగాలనుకున్నారు. అయితే, అది వాయిదా పడింది. మోడీతో జరిగే భేటీలో ఈ ఏడాదికి ఈ మొత్తాన్ని ఆయన అడగవచ్చు.
రాజధాని అమరావతిలో కార్యాలయాల నిర్మాణానికి చంద్రబాబు ఫండ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానిని ఆ మొత్తం అడగాలనుకున్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 22వ తేదీన అమరావతి రాజధాని నిర్మాణానికి పునాది రాయి వేయనున్నారు. గత ఏడాది కేంద్రం రూ.1500 కోట్లను రాజధానిలో నిర్మాణాల కోసం ఇచ్చింది.
ప్రధానితో ప్రత్యేకంగా సమావేశం కానున్న చంద్రబాబు... హోదా, ప్యాకేజీ ఎందుకు అవసరమో పేర్కొంటూ సమగ్ర నివేదికను తయారు చేయించారని సమాచారం. వచ్చే ఐదేళ్లలో ప్రత్యేక హోదా రూపంలో రూ.25 వేల కోట్లు, ప్యాకేజీ కింద మరో రూ.1.25 లక్షల కోట్లు... మొత్తం రూ.1.5 లక్షల కోట్లు రాష్ట్రానికి ఇవ్వాలని ఆయన కోరనున్నట్టు తెలుస్తోంది.
విభజన చట్టంలోని అంశాలు, అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు, విభజన అనంతరం ఏపీలో కనిష్ఠ స్థాయికి పడిపోయిన హ్యూమన్ డెవలప్మెంట్ సూచికలు తదితరాలను గణిస్తూ ఉన్నతాధికారులు రిపోర్టును తయారు చేశారు. దీంతోనే చంద్రబాబు ప్రధానిని కలవనున్నారు.
బీహారుకు రూ. 1.65 లక్షల కోట్ల ప్యాకేజీలను ప్రకటించిన నేపథ్యంలో అంతే స్థాయిలో ఏపీకి కూడా అవకాశాలు దగ్గర చేయాలని చంద్రబాబు కోరే అవకాశాలున్నాయి. రాష్ట్రం వెనుకబడి వున్న పౌష్టికాహారం, అక్షరాస్యత, పారిశుద్ధ్యం, వయోజన విద్య తదితర రంగాల్లో పుంజుకునేందుకు ఏడాదికి రూ.10 వేల కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు రూ.50 వేల కోట్లివ్వాలని బాబు కోరనున్నారని తెలుస్తోంది.