అవినీతి పై సీఎం ఉక్కుపాదం..!నేడు మంత్రివర్గ ఉపసంఘంతో జగన్ భేటీ..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తానన్న జగన్ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసారు. అందులో భాగంగా నేడు మంత్రి వర్గ ఉపసంఘంతో తొలిసారి భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కానున్న ఈ సమీక్ష సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. 30 అంశాలపై అవినీతిని వెలికితీసేందుకు వైఎస్ జగన్ కొన్ని రోజులక్రితం సబ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కమిటీ గత ప్రభుత్వ పాలసీని సమీక్షించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భేటీలో భాగంగా ఏఏ అంశాలపై దృష్టిపెట్టాలో సబ్కమిటీకి జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. కాగా.. ఈ సబ్కమిటీలో ఐదుగురు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి, కురసాల కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్సింగ్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ.. గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు, అవకతవకలు, అవినీతిపై లోతుగా అధ్యయనం చేయనుంది. ఆరునెలల్లో సమీక్ష పూర్తి చేసి.. నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
ఇదిలా ఉండగా ఏలో పథకాల డోర్ డెలివరీ కోసం నాలుగు లక్షలమంది వలంటీర్లను నియమించనున్నారు. వలంటీర్ల సేవలకు ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుంది. వారికి నెలకు ఐదు వేల రూపాయలు గౌరవవేతనం ప్రకటించింది. వయో పరిమితి 25- 35 ఏళ్లు. 50 ఇళ్లకు ఒక వలంటీరు ఉంటారు. ప్రభుత్వ పథకాలను వారు అర్హుల ఇళ్లకే తీసుకెళతారు. సామాజిక పింఛన్లు, కిడ్నీ డయాలసిస్, కేన్సర్ రోగులకు నెలకు ఇచ్చే రూ. 10 వేలు నేరుగా వారి చేతికే వలంటీర్లు అందిస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వలంటీర్ల సేవలు వినియోగించుకొన్నారు. ముఖ్యంగా పీసా చట్టంపై ఆదివాసీలకు అవగాహన కల్పించారు.
గ్రామ సభ ఏర్పాటు చేయడం, ఆయా కుటుంబాలకు అవసరమైన సౌకర్యాలు అందించడం, ప్రజల్లో ప్రభుత్వ కార్యక్రమాల పట్ల వ్యతిరేకతను తగ్గించేలా వలంటీర్లు కృషిచేశారు. గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓలు, జిల్లా కలెక్టర్లు, ఇతర పలు శాఖలు ప్రజలకందించే సేవలకు అనుసంధాన కర్తగా వ్యవహరించారు. గ్రామ వాలంటీర్ల సేవలపై జగన్మోహన్ రెడ్డి పెద్ద యెత్తున ఆశలు పెట్టుకొంది. పార్టీ లోని ముఖ్య నేతలతో వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది వైసీపి ప్రభుత్వం.