అసెంబ్లీ తీర్మానంపై ప్రధానికి కిరణ్ రెడ్డి లేఖ: ఆనం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర ఉద్యోగులు ముఖ్యమంత్రి కోరినట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని అడ్డుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన తెలిపారు. సమైక్యవాదం ఒక్కటే రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్లు ఆయన చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు సఫలమయ్యాయని, వారు విధుల్లో చేరుతున్నారని ఆయన చెప్పారు. సమ్మె కాలంలో వేతనం గురించి చర్చలు జరగలేదని, మంత్రి వర్గ ఉప సంఘం వారితో ఇతర విషయాలపై చర్చిస్తుందని ఆయన చెప్పారు.
సమైక్యాంధ్రకు తాము కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఇదివరకు తీర్మానం చేసి కాంగ్రెసు అధిష్టానానికి, ప్రధానికి పంపించామని, తాము దానికే కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా దానికే కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతకు మించి మరో నిర్ణయం తీసుకోవడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులమంతా సమైక్యాంధ్ర కోసం ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తామని ఆనం చెప్పారు.
కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, వామపక్షాలు, బిజెపిలు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయని, అయితే గతంలో చెప్పిన అభిప్రాయాలపై పునరాలోచన చేస్తున్నాయని ఆయన అన్నారు. విభజనకు అనుకూలమనో, ప్రతికూలమనో చెప్పే స్థితిలో రాజకీయ పార్టీలు లేవని, సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా విభజనను వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు.
ఐటిఐఆర్, విభజనకు సంబంధం లేదని, ఐటిఐఆర్ ప్రతిపాదన ఇప్పటిది కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చత్తీస్గడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటుకు పాటించిన విధానాలనే ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ పాటించాలని ప్రధానికి, కేంద్ర హోం శాఖకు లేఖలు రాస్తానని ఆయన ఎపిఎన్జీవోలతో చెప్పారు. ఉద్యోగ సంఘాలు కలుసుకునే అవకాశం జివోఎం ఇవ్వాలని, ఉద్యోగ సంఘాలకు ఇవ్వకపోతే తాము కూడా కలవబోమని ఆయన చెప్పారు.